ఆలయంలో ఆధిపత్యపోరు

ABN , First Publish Date - 2021-11-03T07:02:40+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ పాలక మండలి చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌, ఈవో శ్రీనివాసరెడ్డి మధ్య అధిపత్య పోరు నడుస్తోంది.

ఆలయంలో ఆధిపత్యపోరు
శింగరకొండ ఆలయం (ఇన్‌సెట్‌లో) శ్రీనివాసకుమార్‌, శ్రీనివాసరెడ్డి

శింగరకొండలో చైర్మన్‌ వర్సెస్‌ ఈవో

ఇద్దరి మధ్య అంతర్యుద్ధం

నలిగిపోతున్న సిబ్బంది, పూజారులు

పూజా సామగ్రితోపాటు, ప్రసాదం 

తయారీలో కల్తీ అంటున్న చైర్మన్‌

అధికారుల అవినీతిపైనా ఆరోపణలు

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం

అలాంటిదేమీ లేదంటున్న ఈవో 

అద్దంకి, నవంబరు 2 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ పాలక మండలి చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌, ఈవో శ్రీనివాసరెడ్డి మధ్య అధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల ఇది మరింత ముదిరింది. ఆలయంలోని వ్యవహారాలు, అధికారుల తీరుపై చైర్మన్‌ బహిరంగంగానే ఆరోపణలకు దిగారు. వీటిపై దేవదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈవో మాత్రం అంతా సవ్యంగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. 


ఆరంభం నుంచి అభిప్రాయభేదాలు 

శింగరకొండ ప్రసన్నాంజనేయ దేవాలయ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజులకే చైర్మన్‌, ఈవో మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. అనంతరం ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరించారు. విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని సామరస్య ధోరణితో వెళ్లాలని సూచించారు. దీంతో ఒకట్రెండు నెలలు ఇద్దరూ సయోద్యగా ముందుకు సాగుతు న్నట్లు కనిపించారు. పక్షం రోజుల నుంచి ఇద్దరి మధ్య మళ్లీ అంతర్యుద్ధం మొదలైంది. ఈనేపథ్యంలో ఆలయంలో అవినీతి వ్యవహారాలు జరుగుతున్నా యని, అంతా కల్తీమయమైందని చైర్మన్‌ బహిరంగంగానే ఆరోప ణలకు దిగారు.  దేవాలయంలో వినియోగించే పూజా సామగ్రితోపాటు లడ్డు, పులిహోర తయారీకి కల్తీ నెయ్యి, నూనెలు వాడినట్లు తాను నిర్వహించిన తనిఖీలలో తేలిందని ఆయన  మంగళవారం విలేకరులకు తెలిపారు. స్వామికి, భక్తులు విని యోగించే సింధూరం కూడా నాసి రకంగా ఉందన్నారు. దీపారాధనకు  ఉపయోగించే నూనె, నెయ్యి వాడ కం, కొనుగోలులో వ్యత్యాసం ఉన్న ట్లు తేలిందన్నారు. అభివృద్ధి, మరమ్మతుల గురించి పాలకమండలికి కనీస సమాచారం ఇవ్వకుండానే పనులు చేయించి ఇష్టానుసారం బిల్లు లు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతి నెలా అమావాస్య,  పౌర్ణమి సందర్భంగా చేసే పూజలలో కూడా విపరీతంగా ఖర్చులు చూపిస్తున్నా రన్నారు. పోటు గది, స్టోర్‌ రూమ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సిబ్బందికి విధులు కూడా ఇష్టానుసారం కేటాయిస్తూ అవుట్‌ సోర్సింగ్‌ వారిని అందలం ఎక్కిస్తున్నారని విమర్శించారు. పాలక మండలి చేసిన తీర్మానాలను అమలు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చైర్మన్‌  వెల్లడించారు. 


 సిబ్బంది, పూజారులు  సతమతం

చైర్మన్‌, ఈవో మధ్య అంతర్యుద్ధంతో కార్యాలయ సిబ్బంది, పూజారులు నలిగిపోతున్నారు. ఎవరికి ఏమి చెప్పాలో అర్థంకాక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేవాలయ అభివృద్ధికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన దాతలు కూడా వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. వీరిమధ్య అంతర్గత పోరు ఆలయ అభివృద్ధికి విఘాతం కలిగించే అవకాశం ఉందని భక్తులు అభిప్రాయపడుతు న్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని విభేదాలకు తెరదించాలని కోరుతున్నారు. 


Updated Date - 2021-11-03T07:02:40+05:30 IST