ఆర్థిక కష్టాల్లో Electricity Board

ABN , First Publish Date - 2022-07-15T13:19:10+05:30 IST

రాష్ట్ర విద్యుత్‌ బోర్డు (టీఎన్‌ఈబీ) ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. నిధుల కొరతతో సతమతమైపోతోంది. దీంతో కష్టాల నుంచి గట్టెంక్కేందుకు విద్యుత్‌ చార్జీలు

ఆర్థిక కష్టాల్లో Electricity Board

                             - చార్జీల పెంపుపై దృష్టి?


అడయార్‌(చెన్నై), జూలై 14: రాష్ట్ర విద్యుత్‌ బోర్డు (టీఎన్‌ఈబీ) ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. నిధుల కొరతతో సతమతమైపోతోంది. దీంతో కష్టాల నుంచి గట్టెంక్కేందుకు విద్యుత్‌ చార్జీలు పెంచడంపై అధికారులు దృష్టిసారించారు. అయితే, విద్యుత్‌ చార్జీలు పెంచడం వల్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వాధినేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. దాంతో ఇతర ఆదాయ మార్గాలను ఈబీ అధికారులు అన్వేషిస్తున్నారు. దేశంలో విద్యుత్‌ వినియోగం అధికంగా ఉండే రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. నగర, పట్టణీకరణ అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. దీంతోపాటు విద్యుత్‌ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది.  డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తిపై కూడా ప్రభుత్వం దృష్టిసారించింది. అదేసమయంలో ప్రస్తుతం ప్రారంభించిన విద్యుత్‌ ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టింది. 


రూ.72 వేల కోట్ల ఆదాయం 

రాష్ట్ర విద్యుత్‌ బోర్డుకు 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రూ.72 వేల కోట్ల ఆదాయం సమకూరింది. అయితే, విద్యుత్‌ కొనుగోళ్ళు, రుణాలు, వడ్డీల చెల్లింపులు, ఇతర అభివృద్ధి పనుల కోసం టీఎన్‌ఈబీ రూ.83,310 కోట్లు ఖర్చు చేసింది. అంటే 2021-22 సంవత్సరంలోనే రూ.11,213 కోట్ల మేరకు నష్టాలను చవిచూసింది. ఇలా ప్రతి యేటా దాదాపు రూ.10 వేల కోట్ల మేరకు నష్టాలను చవిచూడటంతో ప్రస్తుతం విద్యుత్‌ బోర్డు రుణభారం రూ.1.50 లక్షల కోట్లకు చేరుకుంది. అదేసమయంలో గత ఎనిమిదేళ్ళుగా పెరుగుతున్న ఖర్చులకు అవసరమయ్యే నిధులను ఇతర ప్రత్యామ్నాయ మార్గాల నుంచి సమకూర్చుకోకపోగా, బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ కంపెనీల నుంచి రుణాల రూపంలో సేకరించింది. విద్యుత్‌ బోర్డుకు ఆర్థిక కష్టాలు పెరుగుతున్నప్పటికీ వాటి నుంచి బయటపడేందుకు అవసరమైన నిధులను వినియోగదారుల నుంచి వసూలు చేసే సాహసం చేయలేదు. ఫలితంగా ఈ భారం మరింతగా పెరిగిపోయింది. 


3 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లు

ప్రస్తుతం రాష్ట్రంలో 3 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 2.2 కోట్ల గృహ కనెక్షన్లు, గుడిసెలకు 11 లక్షలు, పరిశ్రమలకు 33 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్‌ బోర్డు నిధుల కొరతను ఎదుర్కొంటున్నందున ఆ కష్టాల నుంచి బయటపడేందుకు విద్యుత్‌ చార్జీలను పెంచాలని కేంద్రం కూడా గతంలో సూచించింది. ఆ ప్రకారంగా విద్యుత్‌ చార్జీలను 20 శాతం మేరకు పెంచాల్సి ఉంది. అయితే, విద్యుత్‌ చార్జీలను పెంచే ప్రతిపాదన ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి విద్యుత్‌ రెగ్యులేటరీ అథారిటీకి చేరలేదు. కానీ, కొత్త చార్జీల జాబితా మాత్రం అధికారులు సిద్ధం చేశారు. 


అమలుకాని మేనిఫెస్టో హామీ

గత ఎన్నికల సమయంలో డీఎంకే మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా విద్యుత్‌ బిల్లులను నెలవారీగా వసూలు చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చి ఒక యేడాది గడిచిపోయింది. కానీ, ఎన్నికల హామీ మాత్రం ఇంకా అమలు చేయలేదు. ఈ హామీని అమలు చేయకుండా, విద్యుత్‌ చార్జీలను పెంచినట్టయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతతో పాటు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం పాలకుల్లో నెలకొంది. దీంతో మరోమారు జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునే విషయాన్ని ఈబీ అధికారులు పరిశీలిస్తున్నారు.

Updated Date - 2022-07-15T13:19:10+05:30 IST