కన్నీరు మున్నీరు..

ABN , First Publish Date - 2020-11-23T04:25:45+05:30 IST

ఈ ప్రమాదంలో క్లీనర్‌ కృష్ణ సజీవ దహనం కావడం, డ్రైవర్‌ బాల తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందడంతో బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

కన్నీరు మున్నీరు..
మంటల్లో లారీ

చింతూరు ఘాట్‌రోడ్డు ప్రమాద మృతులకు అంత్యక్రియలు పూర్తి 

క్యాబిన్‌లో ఇరుక్కొని సజీవదహనమైన క్లీనర్‌

తీవ్ర గాయాలతో మృతిచెందిన డ్రైవర్‌ 

టేకులపల్లి/చర్ల, నవంబరు 22: తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టేకులపల్లి మండలం  బద్దుతండాకు చెందిన లారీ డ్రైవర్‌ గుగులోతు బాల(40), చర్ల మండలం గన్నవరం కాలనీకి చెందిన లారీ క్లీనర్‌ మిడియం కృష్ణ మృతదేహాలకు ఆదివారం వారివారి స్వగ్రామాల్లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో క్లీనర్‌ కృష్ణ సజీవ దహనం కావడం, డ్రైవర్‌ బాల తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందడంతో బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ధాన్యం లోడుతో చర్ల నుంచి రాజమండ్రి వెళ్లి తిరిగి వస్తుండగా చింతూరు ఘాట్‌రోడ్డులో మూలమలుపు వద్ద శనివారం ఆ లారీ బోల్తాపడింది. ఈ క్రమంలో డీజిల్‌ట్యాంకు పగిలి మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో డ్రైవర్‌ బాలకు తీవ్ర గాయాలవగా అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. క్యాబిన్‌లోనే ఉన్న క్లీనర్‌ కృష్ణ సజీవదహనమయ్యాడు. దీంతో వారి మృతదేహాలను స్వగ్రామాలైన బద్దుతండా, గన్నవరం కాలీలకు తీసుకొచ్చి ఆదివారం రాత్రి దాహన సంస్కారాలు నిర్వహించారు. బాలకు భార్య అరుణ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. క్లీనర్‌ కృష్ణకు ఇంకా వివాహం కాలేదు. అతడి తల్లిదండ్రులు కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నారని, ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో వారు ఆసరా కోల్పోయారని స్థానికులు పేర్కొన్నారు.

Updated Date - 2020-11-23T04:25:45+05:30 IST