కెమికల్‌ గొడౌన్‌లో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2020-10-27T06:21:09+05:30 IST

రద్దీగా ఉండే కాకినాడ వార్ఫురోడ్డులో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ కెమికల్‌ గొడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ట్రాఫిక్‌ ఎస్‌ఐలు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

కెమికల్‌ గొడౌన్‌లో అగ్ని ప్రమాదం
మంటలను అదుపు చేస్తున్న ఫైర్‌ సిబ్బంది

 రూ. 30 లక్షల ఆస్తి నష్టం
కాకినాడ క్రైం, అక్టోబరు 26: రద్దీగా ఉండే కాకినాడ వార్ఫురోడ్డులో  ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న  ఓ కెమికల్‌ గొడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ట్రాఫిక్‌ ఎస్‌ఐలు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. దేవాలయం వీధిలో పురుషోత్తం అనే వ్యక్తి కాకినాడ అసోసియేట్‌ కెమికల్స్‌ పేరుతో వివిధ రకాల రసాయనాల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. వ్యాపారం కోసం రసాయనాలను వార్ఫురోడ్డులోని ఓ పాత గొడౌన్‌లో నిల్వ చేస్తున్నాడు. అధిక మొత్తంలో ఫార్మిన్‌,హైపోక్లోరైడ్‌, బ్లీచింగ్‌ ఉన్న గొడౌనలో సోమవారం మఽధ్యాహ్నం అకస్మాత్తుగా పెద్ద శబ్దాలతో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. రసాయనాల నుంచి దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐలు పీవీఆర్‌ మూర్తి, ఏ. గంగారామ్‌ తక్షణం స్పందించి సాలిపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏడీఎఫ్‌వో బి.ఏసుబాబు తన బృందంతో అగ్నిమాసక వాహనంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించారు. కాకినాడ ఇన్‌చార్జి డీఎస్పీ వి.భీమారావు  పరిస్థితిని పర్యవేక్షించారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా పారా మిలటరీ బలగాన్ని రప్పించారు. షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, ఎటువంటి అనుమతులు లేకుండా ప్రమాదకర రసాయనాలు నిల్వ చేశారని ఏడీఎఫ్‌వో ఏసుబాబు చెప్పారు. సుమారు రూ. 30 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు చెప్పారు.  అగ్ని ప్రమాదాన్ని సకాలంలో గుర్తించి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపట్టిన ట్రాఫిక్‌ ఎస్‌ఐలు పీవీఆర్‌ మూర్తి, గంగారామ్‌ను డీఎస్పీ అభినందించారు.

 

Updated Date - 2020-10-27T06:21:09+05:30 IST