బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్తుండగా మంటలు
ABN , First Publish Date - 2022-07-22T14:27:10+05:30 IST
బాటిల్లో పెట్రోల్ పోయించుకొని బంక్ నుంచి బయటకు రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ యువకుడు గాయపడ్డాడు.
హైదరాబాద్/బంజారాహిల్స్: బాటిల్లో పెట్రోల్ పోయించుకొని బంక్ నుంచి బయటకు రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ యువకుడు గాయపడ్డాడు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12 ఎమ్మెల్యే కాలనీలో నివసిస్తున్న మహ్మద్ అబ్బాస్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. బంజారాహిల్స్ బంక్లో పెట్రోల్ కోసం వెళ్లాడు. అతడు ఇచ్చిన డబ్బుకు వాహనం ట్యాంక్ ఫుల్ కావడంతో మిగతా పెట్రోల్ను బాటిల్లో పోయుంచుకున్నాడు. బంక్ నుంచి రెండు పర్లాంగులు ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అతడి దుస్తులకు మంటలు అంటుకోవడంతో స్థానికులు ఆర్పేశారు. కడుపు, చేతులకు గాయాలవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అపస్మారకస్థితిలో ఉన్నాడు. మంటలు ఎలా వ్యాపించాయి అనేది తెలియాల్సి ఉంది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.