పడవలపై జాలర్ల నిరసన

ABN , First Publish Date - 2022-05-31T16:22:37+05:30 IST

ఉద్యోగావకాశాలు కల్పించాలన్న డియాండ్లతో తిరువొత్తియూరుకు చెందిన జాలర్లు పడవలపై వెళ్లి నిరసన తెలిపిన సంఘటన సోమవారం అత్తిపట్టులో కలకలం రేపింది.

పడవలపై జాలర్ల నిరసన

                           - అత్తిపట్టులో కలకలం


ప్యారీస్‌(చెన్నై): ఉద్యోగావకాశాలు కల్పించాలన్న డియాండ్లతో తిరువొత్తియూరుకు చెందిన జాలర్లు పడవలపై వెళ్లి నిరసన తెలిపిన సంఘటన సోమవారం అత్తిపట్టులో కలకలం రేపింది. అత్తిపట్టులోని ఉత్తర చెన్నై థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కోసం వినియోగించిన అనంతరం వృధా జలాల్ని ఎన్నూర్‌ వద్ద సముద్రంలో వదులుతున్నందున చేపలు, రొయ్యల ఉత్పత్తి పూర్తిగా స్తంభించిపోతోందంటూ స్థానిక జాలర్లు వాపోతున్నారు. ఆ వృధా జలాలు అధిక వేడిగా, రసాయనాలు మిళితమై ఉండడంతో జలరాశులు అంతరించిపోతున్నాయి. అందువల్ల ఆ నీటి విడుదల ను అడ్డుకోవాలని కోరుతూ పలుమార్లు జిల్లా యంత్రాంగం, ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఎలాంటి చర్యలు లేకుండాపోయాయి. అందువల్ల తీవ్రంగా నష్టపోతున్న ఎన్నూర్‌ పరిధిలోని తాళంకుప్పం, నెట్టుకుప్పం, కాట్టుకుప్పం, ఎన్నూర్‌కుప్పం సహా 8 గ్రామాలకు చెందిన జాలర్లకు ఆ ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో ఉద్యోగావకాశాలు కల్పించాలని గతంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారు. దీంతో ఆ విద్యుత్‌ కేంద్రం యాజమాన్యం జాలర్ల సంఘాల ప్రతినిధులతో అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుంది. అది ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదు. దీంతో ఎన్నూర్‌కుప్పం ప్రాంతానికి చెందిన సుమారు వంద మందికిపైగా జాలర్లు సోమవారం ఉదయం ఫైబర్‌ బోట్ల లో సముద్ర ముఖద్వారం ప్రాంతానికి వెళ్లారు. థర్మల్‌ కేంద్రం నుంచి నీరు విడుదల చేస్తున్న ముఖద్వారాన్ని ఇసుక బస్తాలతో మూసివేశారు. సమాచారం తెలిసి అక్కడకు చేరుకున్న ఎన్నూర్‌ పోలీసులు విద్యుత్‌ బోర్డు అధికారుల సమక్షంలో ఆందోళనకారులతో చర్చలు జరిపారు. కాగా, తమ డిమాడ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని జాలర్లు తేల్చిచెప్పారు.

Updated Date - 2022-05-31T16:22:37+05:30 IST