మత్స్యకారులకు తీరని కష్టం

ABN , First Publish Date - 2021-12-10T04:25:28+05:30 IST

మండలంలోని పల్లెపాళెం తీర ప్రాంత మత్స్యకారులకు తీరని కష్టం వచ్చింది.

మత్స్యకారులకు తీరని కష్టం
పెన్నా వరదలకు కొట్టుకుపోయిన వంతెన

పెన్నా ముంపునకు కొట్టుకుపోయిన పల్లెపాళెం వంతెన

సముద్రానికి వెళ్లేందుకు ఏకైక మార్గం 

నెల రోజులుగా పనులు లేక బతుకు వెళ్లదీస్తున్న జాలర్లు


ఇందుకూరుపేట, డిసెంబరు 9 : మండలంలోని పల్లెపాళెం తీర ప్రాంత మత్స్యకారులకు తీరని కష్టం వచ్చింది. వేట సాగలేక బతుకులు భారమయ్యాయి. మూడు వారాల క్రితం వచ్చిన వరద ముంపు ఇప్పటికీ వారి బతుకుల్లో సుడిగుండం సృష్టిస్తూనే ఉంది. వీళ్లకి వల, పడవ ఎంత అవసరమో ఈ రెండు పట్టుకుని వేట సాగించాలంటే సముద్రానికి వెళ్లేందుకు వంతెన కూడా అంతే అవసరం. సముద్రమే వారికి జీవితం. అయితే దురదృష్టవశాత్తు మొన్నటి పెన్నా ముంపునకు సముద్రానికి వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గం వంతెన. అదే కొట్టుకుపోయి దాదాపు 20 అడుగుల ఎత్తులో 20 అడుగుల పొడవునా కూలిపోయింది. దీంతో వారికి దారి లేదు. వెళ్లే మార్గం లేదు. సముద్రం కంటి చూపు మేర ఉన్నా.. చేరుకునే అవకాశం లేదు. వేట సాగించే వీలు చిక్కలేదు. నడిచి వెళ్దామంటే 20 అడుగుల లోతులో నీళ్లు వస్తున్నాయి. అందులోనూ బురద కూరుకొని ఉంది. వెళ్లే సాహసం చేసే వీలు లేదు. అందులోను వేట నుంచి మత్స్యకారులు వచ్చే వేళకు మహిళలు, కుటుంబ సభ్యులు కూడా సముద్ర సంపద కోసం అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మహిళలు కూడా అక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సముద్ర నుంచి చేపలు, బరువైన సంపద తీసుకువచ్చేందుకు వసతులు కూడా లేవు. వంతెన కూలిపోయిన తర్వాత ఏమీ చేయలేని నిస్సహాయకులుగా మిగిలిపోయారు. వరద ముప్పు పల్లెపాలెంలో జాలర్లను అతలాకుతలం చేస్తుంది. ఇప్పటికే దాదాపు నెల రోజుల పైగా పనులు లేక బతుకు వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు మేల్కొని వంతెనను వేగవంతంగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.  


Updated Date - 2021-12-10T04:25:28+05:30 IST