వైరాలో జలపుష్పాల వేట
ABN , First Publish Date - 2021-02-27T05:09:21+05:30 IST
వైరాలో జలపుష్పాల వేట
హోల్సేల్ రూ.80, రిటైల్ రూ.150 పలికిన ధర
వైరా, ఫిబ్రవరి 26: ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్లో చేపల వేట గురువారం రాత్రి నుంచి మొదలైంది. దాదాపు రూ.కోటి విలువైన వంద టన్నుల చేపల వేట సాగింది. అయితే స్థానికులు మాత్రం అధిక ధరలు చెల్లించి చేపలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కిలో చేపలు రూ.80చొప్పున హోల్సేల్గా విక్రయించి స్థానికులకు మాత్రం డిమాండ్ను బట్టి కిలో చేపలు రూ.100నుంచి రూ.150వరకు విక్రయించారు. హోల్సేల్గా రూ.80కి విక్రయించి, స్థానికులకు రూ.100నుంచి రూ.150వసూలు చేయటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ ఏటా ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడ చేపల వేట నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం రెండునెలలు ముందుగానే మత్స్యకారులు ప్రభుత్వ లీజుసొమ్ము చెల్లించారు. దీంతో చేపల వేటకు కలెక్టర్ ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను వైరా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి జి.శివప్రసాద్ మత్స్యకారులకు అందజేశారు. దీంతో వైరా చేపల సొసైటీ పరిధిలోని వైరా, కొణిజర్ల, తల్లాడ మండలాల్లోని 11గ్రామాలకు చెందిన వెయ్యిమంది మత్స్యకారులు గురువారం రాత్రే చేపల వేటకు దిగారు. శుక్రవారం తెల్లవారుజాముకే హోల్సేల్ ధరపై చేపలు విక్రయించారు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం తమ దగ్గరకు వచ్చిన స్థానికులకు మాత్రం అధిక రేట్లకు విక్రయించారు.
తల్లాడ మండలంలోని కొడవటిమెట్ట, వైరాకు సమీపంలో మిషన్ భగీరథ అలాగే వైరా సమీపంలో రెండుచోట్ల, సిద్దిక్నగర్ సమీపంలో రెండుచోట్ల, సింగరాయపాలెంలో రెండుచోట్ల హోల్సేల్ ధరలకు చేపలు విక్రయించారు. వాటిని కొనుగోలు చేసిన వ్యాపారులు వాహనాల్లో హైదరాబాద్, ఏపీ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేశారు. 14కిలోల బరువుకల్గిన వాలుగ చేప, ఏడున్నర నుంచి ఎనిమిదికిలోల బరువున్న బొచ్చరకం చేపలు పట్టుబడ్డాయి. ఎక్కువగా రోహు చేపలు లభించాయి. కొంతమంది మత్స్యకారులకు భారీగా చేపలు పడగా కొద్దిమందికి మాత్రం స్వల్పంగానే చేపలు లభించాయి. వైరా రిజర్వాయర్ ప్రాంతమంతా మత్స్యకారులు, స్థానికులతో సందడి నెలకొంది.