ఆర్టీసీ డ్రైవర్కు ఫిట్స్
ABN , First Publish Date - 2021-07-27T04:23:33+05:30 IST
ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్లో 54 మంది ప్రయాణికులను సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్కు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో డ్రైవర్కు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది.
డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
తూప్రాన్, జూలై 26 : ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్లో 54 మంది ప్రయాణికులను సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్కు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో డ్రైవర్కు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. నోట్లోంచి రక్తం కారుతున్నప్పటికీ, డ్రైవర్ సమయస్ఫూర్తి ప్రదర్శించి రోడ్డుపైనే ఆర్టీసీ బస్సును ఆపేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో సోమవారం చోటుచేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు (టీఎస్ 17 జడ్ 0031) డ్రైవర్ మహబూబ్(40), కండక్టర్ కృష్ణ మోహన్తో సోమవారం ఉదయం సికింద్రాబాద్ జేబీఎ్సకు బయలుదేరింది. ఆ బస్సు మెదక్ జిల్లా తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్కు 9 గంటల ప్రాంతంలో చేరుకున్నది. అక్కడ ప్రయాణికులను ఎక్కించుకుని తూప్రాన్ పట్టణ బస్టాండ్ నుంచి కొంతదూరం వెళ్లగానే డ్రైవర్కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతోపాటు, నోట్లోంచి రక్తం చిమ్మింది. ఆ సమయంలోనూ డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డుపైనే నిలిచివేశాడు. ప్రయాణికులు డ్రైవర్ మహబూబ్ పరిస్థితిని గుర్తించి ఆయనను కిందకు దించి వెంటనే తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. తూప్రాన్ నుంచి బస్సు బయలుదేరిన సమయంలో అందులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. ఫిట్స్ వచ్చినా డ్రైవర్ మహబూబ్ సమయస్ఫూర్తితో బ్రేక్ వేసి బస్సును నిలిపివేయడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు.