Union Ministerకి బెదిరింపు ఫోన్ కాల్స్...రూ.కోటి డిమాండ్
ABN , First Publish Date - 2021-12-25T17:16:55+05:30 IST
సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెనీకి బెదిరింపు ఫోన్ కాల్స్ చేసిన ఐదుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు...
ఐదుగురు నిందితుల అరెస్ట్
న్యూఢిల్లీ: సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెనీకి బెదిరింపు ఫోన్ కాల్స్ చేసిన ఐదుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.నోయిడా, ఢిల్లీ నగరాలకు చెందిన కబీర్ వర్మ, అమిత్ కుమార్, అమిత్ మాఝీ, నిశాంత్, అశ్వనీలనే ఐదుగురు యువకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బెదిరిస్తూ ఫోన్ కాల్స్ చేశారు. అక్టోబరు 3వతేదీన జరిగిన లఖింపూర్ ఖేరీ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు సహా 8మంది మరణించారు. ఈ కేసులో మంత్రి అజయ్ మిశ్రా కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.
లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి వీడియో క్లిప్ లు తమ వద్ద ఉన్నాయని, కోటిరూపాయలు ఇస్తే వాటిని ఇస్తామని ఐదుగురు యువకులు కేంద్ర సహాయమంత్రిని బెదిరించారు. కేంద్ర సహాయమంత్రిని కోటిరూపాయలు డిమాండ్ చేస్తూ ఫోన్ కాల్స్ చేశారని మంత్రి పేషీ అధికారులు చేసిన ఫిర్యాదు మేర ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు వివరించారు.