చోరీ కేసుల్లో ఐదుగురు అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-06-28T05:00:10+05:30 IST

రాయచోటి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో చోరీలు చేసి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఐదుగురు నిందితులను సోమవారం రాయచోటి అర్బన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు.

చోరీ కేసుల్లో ఐదుగురు అరెస్ట్‌
నిందితులు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీధర్‌

రాయచోటిటౌన్‌, జూన్‌ 27: రాయచోటి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో చోరీలు చేసి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఐదుగురు నిందితులను సోమవారం రాయచోటి అర్బన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. రాయచోటి డీఎస్పీ శ్రీధర్‌ వెల్లడించిన వివరాల మేరకు... రాయచోటి పట్టణంలోని భట్టువీధికి చెందిన అత్తార్‌ మహమ్మద్‌, రాయుడుకాలనీకి చెందిన పెదివీటి దావీద్‌, సయ్యద్‌ సాధిక్‌అలీ, మ హబూబ్‌బాషా, షేక్‌. ఫయాజ్‌ దుర్వ్యసనాలకు బానిసయ్యారు. అందుకు అవసర మైన డబ్బుకోసం చోరీలకు అలవాటుపడ్డారు. పగలు కూలి పనులు చేసుకుంటూ, రాత్రి వేళల్లో దుకాణాల షట్టర్లు పగులగొట్టి  చోరీలు చేసేవారు. సోమవారం రాయుడుకాలనీ స మీపంలోని ఏజీ గార్డెన్‌ క్రాస్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి  7 మొబైల్‌ ఫోన్లు, నాలుగు బంగారు ఉంగరాలు, రెండు జతల కమ్మలు, 11 బ్యాటరీలు, ఒక పల్సర్‌ మోటారు బైకు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలియజేశారు.


Updated Date - 2022-06-28T05:00:10+05:30 IST