లఖింపూర్ ఖేరీ కేసు.. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2021-12-25T01:10:26+05:30 IST

లఖింపూర్ ఖేరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా

లఖింపూర్ ఖేరీ కేసు..  కేంద్రమంత్రి అజయ్ మిశ్రా సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘటనకు సంబంధించిన వీడియోలతో కొందరు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, రూ. 2.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.


అక్టోబరు 3న లఖింపూర్ ఖేరీలో రైతుల పైనుంచి వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఇతర సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని, అడిగినన్ని డబ్బులు ఇవ్వకుంటే వాటిని బయటపెడతామని బెదిరిస్తూ ఈ నెల 17న గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.


కేసు నమోదు చేసుకున్న ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీసులు మంత్రి నివాసంపై నిఘా పెట్టారు. నొయిడాలో నలుగురిని, ఢిల్లీలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) ద్వారా కాల్స్ చేసినట్టు గుర్తించారు.


అరెస్ట్ అయిన వారిని కబీర్ కుమార్, అమిత్ కుమార్, నిశాంత్ కుమార్, అశ్విన్ కుమార్‌గా గుర్తించారు. వీరిలో ఇద్దరు గ్రాడ్యుయేషన్ చదువుతుండగా, మిగతా వారు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించి వార్తలను చూసి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే వారీ ప్లాన్ వేసినట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నట్టు చెప్పారు.

Updated Date - 2021-12-25T01:10:26+05:30 IST