కన్నీరు‘మునేరు’ : గల్లంతైన ఐదుగురు చిన్నారులూ మృతి.. ఊరంతా విషాదంలో...

ABN , First Publish Date - 2022-01-11T16:42:21+05:30 IST

సెలవులు వచ్చాయన్న సంతోషం.. ఆ చిన్నారుల్లో కాసేపు కూడా నిలవలేదు. మునేరు రూపంలో ఆ చిన్నారులను బలి తీసుకుని వారి ఇంట విషాదాన్ని నింపింది.

కన్నీరు‘మునేరు’ : గల్లంతైన ఐదుగురు చిన్నారులూ మృతి.. ఊరంతా విషాదంలో...

విజయవాడ : సెలవులు వచ్చాయన్న సంతోషం.. ఆ చిన్నారుల్లో కాసేపు కూడా నిలవలేదు. మునేరు రూపంలో ఆ చిన్నారులను బలి తీసుకుని వారి ఇంట విషాదాన్ని నింపింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఐదుగురు చిన్నారులు సెలవులిచ్చిన ఆనందంలో సరదాగా ఈత కొట్టేందుకు మునేరుకు వెళ్లారు. తిరిగి విగతజీవులుగా తల్లిదండ్రుల కళ్లకు కనిపించారు. గుండెలవిసేలా రోదిస్తున్న ఆ తల్లిదండ్రుల బాధను చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవతున్నారు. చిన్నారుల మృతితో ఊరంతా విషాదంలో మునిగిపోయింది. 


కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని జడ్పీ పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడంతో మధ్యాహ్నం భోజనం తరువాత మునేటిలో ఈతకు వెళ్లారు. పొలం పనులకు వెళ్లి తిరిగివచ్చిన తల్లిదండ్రులు పిల్లలు కనిపించకపోవడంతో వెతకడం మొదలెట్టారు. మునేటి ఒడ్డున పిల్లల దుస్తులు కనిపించినట్టు సమాచారం అందడంతో ఐదుగురి తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు. పిల్లల దుస్తులు చూసి కుప్పకూలిపోయారు. తమ పిల్లలు నీటిలో గల్లంతయ్యారా? లేక ఇంకెక్కడికైనా వెళ్లారా? అని ఆందోళన చెందాడు.


గ్రామానికి చెందిన నాగులూరి సుబ్బారావు, మేరీల చిన్న కుమారుడు నాగులూరి సన్ని, కర్ల గురవయ్య, లక్ష్మిల కుమారుడు కర్ల బాల ఏసు, మైలా దానయ్య, ఆంథోనీల కుమారుడు రాకేష్‌, జట్టి సుందరరావు, అరుణల కుమారుడు అజయ్‌, జర్రిపోతుల నాగేశ్వరరావు, రాణిల మనుమడు గురజాల చరణ్‌ గల్లంతయ్యారు. వీరంతా 11, 12 ఏళ్ల వయసు చిన్నారులు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్‌ సుశీలాదేవి, సీఐ నాగేంద్ర కుమార్‌, ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో కలసి వెళ్లి స్థానిక జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. తిరిగి నేటి ఉదయం గాలింపు చర్యలు చేపట్టి ఐదు మృతదేహాలనూ వెలికి తీశారు. 


Updated Date - 2022-01-11T16:42:21+05:30 IST