మునకేసిన గ్రామాలు
ABN , First Publish Date - 2020-11-27T04:52:56+05:30 IST
ఇందుకూరుపేట మండలంలో లోతట్టు దళిత, గిరిజన, జాలర్ల కాలనీలు నీటమునిగాయి.
ఇందుకూరుపేట, నవంబరు 26 : ఇందుకూరుపేట మండలంలో లోతట్టు దళిత, గిరిజన, జాలర్ల కాలనీలు నీటమునిగాయి. కొమరిక, ముదివర్తిపాలెం, నిడిముసలి గ్రామ వాడల్లో గురువారం నీటిలో తేలియాడాయి. మైపాడు, పల్లెపాడు, కొరుటూరు, పల్లెపాలెం, గంగపట్నం ప్రజలను ఇన్చార్జి తహసిల్దారు నాగరాజు ఆధ్వర్యంలో తుఫాను షెల్టర్లకు చేర్చి భోజన వసతి ఏర్పాటు చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రహదారులను, మార్గాలను సుగమం చేస్తున్నాయి. నారుమళ్లు మాత్రం వందల ఎకరాల్లో మునిగిపోయాయి.తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. రెవెన్యూ అధికారులు, పోలీసు, గ్రామ అధికారులు సత్వర ఏర్పాట్లు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
చెరువులను తలపిస్తున్న పొలాలు
బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 26 : మండలంలోని పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. గిరిజన, దళితవాడలు జలమయమయ్యాయి. ఎంపీడీవో నరసింహరావు, వవ్వేరు బ్యాంకు చెర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి పెనుబల్లిలో అరుంధతివాడని పరిశీలించి ముంపు నీటి తొలగింపు చర్యలు చేపట్టారు. కాగులపాడు,పెనుబల్లి, దామరమడుగు, రేబాల, కట్టుబడిపాళెం, బుచ్చి జొన్నవాడ మార్గంతోపాటు, కాగులపాడు మార్గంలో పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. పెన్నానదికి వరద నీరు అంచలంచెలుగా పెరుగుతోంది. వర్షాలతో
కూలిన వెంకయ్యస్వామి ఆలయ వరండాలు
బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 26: తుఫాను కారణంగా మునులపూడి గ్రామం బట్టిపాటిదిన్నెలోని భగవాన్ వెంకయ్య స్వామి గుడికి ముందున్న వరండాలు గురువారం కూలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన భక్తులు బయటకు పరుగులు తీయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో లక్ష రూపాయలకు పైగా ఆస్తి నష్టం కలిగిందని భక్తుడు మస్తానయ్య తెలిపారు. వరండాలతోపాటు పెద్ద చెట్లు కూడా నేల కూలాయి.
జనజీవనం అతలాకుతలం
కోవూరు, నవంబరు 26: కోవూరు మండలంలో జనజీవనం అతలాకుతలమైంది. భారీ చెట్లు నేలకూలాయి. ఇనమడుగు, పాటూరుల్లోని దళిత కాలనీల్లోకి వర్షపునీరు ప్రవహించింది. పంటపొలాల్లో వర్షపు నీరు చేరింది. మలిదేవివాగు, పంటకాలువలు పొంగిపొర్లుతున్నాయి. పాటూరులో 120, ఇనమడుగులో 25, సాలుచింతలలో 64 కుటుంబాలను రక్షితప్రదేశాలకు తరలించారు. పాటూరులోని పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, వ్యవసాయ సలహామండలి జిల్లా చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజనబాబురెడ్డి పరిశీలించారు. ఇనమడుగు, సాలుచింతలలోని పునరావాస కేంద్రాల్ని తహసీల్దారు సుబ్బయ్య, ఎంపీడీఓ శ్రీహరి పరిశీలించారు.