వర్ష ప్రభావిత ప్రాంతాల్లో Cm Stalin పర్యటన
ABN , First Publish Date - 2021-11-30T13:35:09+05:30 IST
నగరంలోని తాంబరం ముడిచ్చూరు, వరదరాజపురం తదితర ప్రాంతాల్లో వర్షబాధిత ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ఉదయం పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వాననీటి తొలగింపు పనులను సమీక్షించారు.
చెన్నై: నగరంలోని తాంబరం ముడిచ్చూరు, వరదరాజపురం తదితర ప్రాంతాల్లో వర్షబాధిత ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ఉదయం పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వాననీటి తొలగింపు పనులను సమీక్షించారు. ప్రభుత్వ ప్రత్యేక శిబిరాల్లో బసచేస్తున్న బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గత రెండు రోజులుగా స్టాలిన్ తేనాంపేట, టి.నగర్, తిరువళ్లూరు జిల్లా ఆవడి, తిరుముల్లైవాయల్, తిరువేర్కాడు, పూందమల్లిలో వర్షబాధిత ప్రాంతాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తన నివాసం నుంచి బయల్దేరిన స్టాలిన్ తాంబరం సమీపంలోని వరదరాజ పురానికి వెళ్ళారు. భారీ వర్షాలకు అధికంగా నష్టపోయిన ప్రాంతాలను సందర్శించారు. అక్కడి పీటీసీ కాలనీ, జననివాస ప్రాంతాల్లో మోకాలిలోతు వర్షపునీటిలో నడచుకుంటూ వెళ్ళి బాధితులను పరామర్శించారు. మంత్రి దామో అన్బరసన్, ప్రత్యేక అధికారి అముద, కాంచీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.ఆరతి, చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ ఆర్.రాహుల్నాథ్, శాసన సభ్యులు ఎస్ఆర్ రాజా, కె.సెల్వపెరుందగై తదితరులు ఆ ప్రాంతాల్లో జరిగిన ఆస్తినష్టాలను గురించి స్టాలిన్కు వివరించారు. అక్కడి వర్షబాధి తులంతా వేల్స్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్నారని తెలుసుకున్న స్టాలిన్ అక్కడికి వెళ్ళి వారికి దుప్పట్లు, పాలు, రొట్టెలు, ధోవతులు, చీరలు తదితర సహాయాలు అందజేశారు. తరువాత ముడిచ్చూరు వెళ్ళి అముదంనగర్లోని వర్షబాధిత ప్రాంతాలను పరిశీలించి సహాయాలు పంపిణీ చేశారు. అనంతరం తాంబరం, ఇరుంబులియూరు ప్రాంతాల్లో పర్యటించారు. వన్నియన్కుళం ప్రాంతం వద్ద వాననీటి తొలగింపు పనులను పరిశీలించారు.