1వ ప్రమాద హెచ్చరిక
ABN , First Publish Date - 2022-08-13T06:04:24+05:30 IST
1వ ప్రమాద హెచ్చరిక
ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
పులిచింతల నుంచి పెరిగిన ఇన్ఫ్లో
4 లక్షల 45 వేల క్యూసెక్కులు దిగువకు..
అండగా కృష్ణలంక రిటైనింగ్ వాల్
సురక్షితంగా కృష్ణలంకలోని ప్రాంతాలు
తోట్లవల్లూరులో మునిగిన లంకలు, పంటలు
అవసరమైన చోట్ల తగు ఏర్పాట్లు : ‘ఎన్టీఆర్’ కలెక్టర్
పాయకాపురం, ఆగస్టు 12 : ప్రకాశం బ్యారేజీకి భారీ వరద నీరు చేరిన నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ నుంచి 4 లక్షల 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని, ఈ నేపథ్యంలోనే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని కలెక్టర్ దిల్లీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వరద నీటి వల్ల దాదాపు 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాసం ఏర్పాట్లు చేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. కృష్ణలంక వాసులు వరద నీటి ముంపునకు గురికాకుండా రిటైనింగ్ వాల్ అడ్డుకుందని తెలిపారు. బ్యారేజీ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకూ నాలుగు లోతట్టు ప్రాంతాలను గుర్తించామని, అవసరమైన చోట్ల తాత్కాలికంగా అడ్డు వేసేందుకు వీఎంసీ, ఇరిగేషన్ అధికారులు 5 వేల ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచారని పేర్కొన్నారు. కృష్ణానది కరకట్టపై కేఈ కెనాల్ ఇంజనీరింగ్ అధికారులు నిరంతరాయంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతానికి ఎవరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం లేదని, వరద మరింత పెరిగితే సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులను సన్నద్ధం చేస్తామని వివరించారు.
లంకలకు వరద
తోట్లవల్లూరు : తోట్లవల్లూరు మండలంలోని కృష్ణానది పాయలకు శుక్రవారం వరద ప్రవాహం భారీగా చేరింది. 4.50 లక్షల క్యూసెక్కుల వరద ఎగువ నుంచి వస్తుండటంతో ఎనిమిది లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవలు నడపకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు భారీ వరదకు కంద, అరటి, మొక్కజొన్న, చెరుకు, పసుపు తోటలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా, వరద పరిస్థితిపై తహసీల్దార్ కె.వెంకట శివయ్య శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.