చప్టాలపైకి వరద.. ఆగిన రాకపోకలు

ABN , First Publish Date - 2022-08-08T05:52:52+05:30 IST

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పట్టణ, మండలంలోని వాగులు పొంగి చప్టాలపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

చప్టాలపైకి వరద.. ఆగిన రాకపోకలు
బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వెదుళ్ల వాగు

తిరువూరు, ఆగస్టు 7:  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పట్టణ, మండలంలోని వాగులు పొంగి చప్టాలపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు సుమారు 7.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.  చౌటపల్లి-జి.కొత్తూరు, కాకర్ల ఎ.కొండూరు మండలం వల్లంపట్ల గ్రామాల మధ్య వెదుళ్ల వాగు, తిరువూరు, అక్కపాలెం గ్రామాల మధ్య పడమటి వాగు, కొకిలంపాడు-తిరువూరు, మునుకుళ్ల- వావిలాల గ్రామాల మధ్య అలుగు వాగు చప్టాలపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. కోకిలంపాడు కొత్తచెరువు ఆయకట్టుతో పాటు మండలంలోని పలు ప్రాంతాల్లో వరి పొలాలు ముంపులో ఉన్నాయి. వాగులు వద్ద పోలీసు  బందోబస్తు ఏర్పాటుచేసి రాకపోకలను నిలిపివేశారు. చింతలపాడు సమీపంలోని గుర్రపు వాగు అలుగు భారీగా ప్రవహిస్తుండటం, తిరువూరు, గంపలగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 


వైరా కట్టలేరుపై రాకపోకల నిలిపివేత

వీరులపాడు : నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వైరా కట్టలేరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దొడ్డదేవరపాడు గ్రామం వద్ద వైరా కట్టలేరు బ్రిడ్జి  పై నుంచి వరద ప్రవహిస్తుండటంతోరాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై సోమేశ్వరరావు ఆదివారం గ్రామానికి చేరుకుని వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరా కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుందని, పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్రిడ్జిపై రాకపోకలు సాగించకుండా సిబ్బందిని ఏర్పాటు చేశారు. 




Updated Date - 2022-08-08T05:52:52+05:30 IST