అసెంబ్లీలో బలపరీక్షే ఏకైక మార్గం...Supreme court లో షిండే లాయర్ వాదన

ABN , First Publish Date - 2022-06-30T01:44:21+05:30 IST

మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే సర్కార్ బలపరీక్ష ఎదుర్కొనే..

అసెంబ్లీలో బలపరీక్షే ఏకైక మార్గం...Supreme court లో షిండే లాయర్ వాదన

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే సర్కార్ బలపరీక్ష ఎదుర్కొనే అంశంపై సుప్రీంకోర్టులో బుధవారం సాయంత్రం వాదోపవాదనలు జరిగాయి. ఇటు ఉద్ధవ్ థాకరే, అటు ఏక్‌నాథ్ షిండే తరఫు లాయర్లు తమ వాదనలను బలంగా వినిపించారు.


అసెంబ్లీలో బలపరీక్షను ఎప్పుడూ జాప్యం చేయకూడదని, రాజకీయ జవాబుదారీతనానికి, బేరసారాలు జరక్కుండా నిరోధించేందుకు బలపరీక్ష నిర్వహించడమే ఏకైక మార్గమని షిండే తరఫు న్యాయవాది నీరజ్ కృష్ణ కౌల్ వాదించారు.ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం జాప్యమవుతోందన్న కారణం చూపించి బలపరీక్షను వాయిదా వేయాల్సిన అవసరం లేదని అన్నారు. గురువారం మధ్యాహ్నం 11 గంటలకు బలపరీక్ష నిర్వహించాలని ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ అదేశించడాన్ని శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. దీనిపై  ప్రభు తరఫున హాజరైన అడ్వకేట్ ఏఎం సింఘ్వి తన వాదనలు వినిపించారు. గురువారమే అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడం చాలా హడావిడిగా తీసుకున్న నిర్ణయమని, అపవిత్రమని ఆయన అన్నారు. రూటు మార్చిన వ్యక్తుల (రెబల్ ఎమ్మెల్యేల) తీరు  ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదని, రేపటికి రేపు బలపరీక్ష జరక్కపోతే ''మిన్ను విరిగి మీదపడదని'' ఆయన అన్నారు. 

Updated Date - 2022-06-30T01:44:21+05:30 IST