వామపక్షాల ఐక్యతపై దృష్టి

ABN , First Publish Date - 2022-01-22T07:46:42+05:30 IST

ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాల ఐక్యతపై దృష్టి సారించవలసిన

వామపక్షాల ఐక్యతపై దృష్టి

  •  నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు

ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాల ఐక్యతపై దృష్టి సారించవలసిన అవసరం ఉందని సీపీఎం నేతలు పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఒకవైపు బీజేపీ ఎదగకుండా అడ్డుకోవడం, మరోవైపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపై రాజీలేని పోరాటాలుచేసేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 35 వేల సభ్యత్వంతో పాటు  3 వేల శాఖలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీపీఎం మూడో రాష్ట్ర మహాసభలు శనివారం నిర్వహించనున్నారు.


నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రంలో పార్టీ బలోపేతంతోపాటు పలు అంశాలపై  చర్చించనున్నారు. పార్టీ సంప్రదాయం ప్రకారం ప్రారంభ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌ బహిరంగ సభను ఏర్పాటుచేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు ప్రసంగిస్తారు. 23న ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని ఎస్‌ఎ్‌సఆర్‌ కన్వెన్షన్‌ హాలులో పార్టీ ప్రతినిధుల సభతో మహాసభలు కొనసాగుతాయి. బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న వైఖరిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఆర్థిక, సామాజిక రంగాల్లో బీజేపీ వైఖరి ప్రమాదకరంగా మారిందని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ మెతక వైఖరి అవలంబిస్తోందని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయు.


ప్రజాసమస్యలకు సంబంధించి ప్రతిపాదించిన పలు తీర్మానాలపై చర్చించనున్నారు. నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోనున్నారు. వచ్చేనెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా, భూసమస్యలపై భారీస్థాయిలో పోరాటాలు చేయడానికి సిద్ధమవుతునట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ప్రధానంగా వామపక్షాల ఐక్యతపై చర్చించనున్నారు. ఎన్నికల సమయంలో పొత్తుల కంటే ప్రజా సమస్యలపై పోరాటాలకు ప్రాముఖ్యతనివ్వనున్నారు. బీజేపీ ఎదగకుండా అడ్డుకోవాలన్నా, టీఆర్‌ఎస్‌ విధానాలపై పోరాటం చేయాలన్నా వామపక్షాల ఐక్యత కీలకమన్న అభిప్రాయాన్ని పలువురు సీనియర్‌ నేతలు వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-01-22T07:46:42+05:30 IST