పేదల కడుపు నింపే పథకాల్లో కక్కుర్తి పడొద్దు
ABN , First Publish Date - 2022-10-01T10:02:36+05:30 IST
పేదల కడుపు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాల విషయంలో అధికారులు కక్కుర్తి పడొద్దని రాష్ట్ర ఆహార కమిషన్ చైౖర్మన్ విజయ్ ప్రతా ప్రెడ్డి అన్నారు. ఈ పథకాలపైనా సంపాదించుకోవాలనే ఆలోచన
తప్పులు సరిచేసుకోకపోతే
కఠిన చర్యలు తప్పవు
అధికారులకు ఆహార కమిషన్ చైర్మన్ హెచ్చరిక
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): పేదల కడుపు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాల విషయంలో అధికారులు కక్కుర్తి పడొద్దని రాష్ట్ర ఆహార కమిషన్ చైౖర్మన్ విజయ్ ప్రతా ప్రెడ్డి అన్నారు. ఈ పథకాలపైనా సంపాదించుకోవాలనే ఆలోచన సరికాదన్నారు. తప్పులు సరిచేసుకోకపోతే ఎంతటివారైనా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడలోని రాష్ట్ర ఆహార కమిషన్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడతూ.. ఇప్పటివరకు రాష్ట్రంలోని 15జిల్లాల్లో పర్యటించి ఆహార భద్రత చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో పర్యటిస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, పౌరసరఫరాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో లోపాలను సవరించుకుని సక్రమంగా అమలుచేసేలా అధికారులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారుల హాజరులో అవకతవకలను గుర్తించినట్లు తెలిపారు.
హాస్టళ్లలో భోజనాలు, కూరలు సరిగా పెట్ట డం లేదన్నారు. సర్కారు ఇస్తున్న డబ్బులు సరిపోవడం లేదని కొందరు తమ దృష్టికి తెచ్చారని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. పథకాల అమలులో లోపాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వాట్సాప్ (9490551117), టోల్ఫ్రీ (155235) నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. సమావేశంలో ఆహార కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ పి.సురేశ్ తదితరులు పాల్గొన్నారు.