ఫోన్లో మాట్లాడొద్దన్నందుకు..
ABN , First Publish Date - 2021-06-20T05:28:07+05:30 IST
ఫోన్లో మాట్లాడొద్దన్నందుకు..
- ఒంటికి నిప్పంటించుకుని బాలిక ఆత్మహత్య
- మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ రాజీవ్గృహకల్పలో ఘటన
ఘట్కేసర్ రూరల్ : ఫోన్ మాట్లాడొద్దని తల్లి మందలించడంతో బాలిక ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా, ఒంద్యాల్ గ్రామానికి చెందిన జమ్మికుంట విష్ణు, పద్మ దంపతులు కూతురు, కొడుకుతో కలిసి కొంతకాలంగా పోచారం మునిసిపాలిటీ, అన్నోజిగూడ, రాజీవ్గృహకల్పలో నివాసం ఉంటున్నారు. కాగా వారి కూతురు జమ్మికుంట స్రవంతి(16) తరచూ ఫోన్ మాట్లాడుతున్నట్లు గమనించి మందలించారు. ఈ క్రమంలో శుక్రవారం బాలిక మళ్లీ ఫోన్లో మాట్లాడుతుండగా చూసిన తల్లి హెచ్చరించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక అదేరోజు రాత్రి 11:56 నిమిషాలకు (సీసీటీవీ ఫుటేజీ ప్రకారం) ఇంట్లో ఉన్న కిరోసిన్ బాటిల్ను తీసుకొని మొయిన్డోర్కు బయటనుంచి గడియపెట్టింది. అనంతరం సమీపంలోని జీసెస్ వే ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా (ఓఆర్ఆర్ పక్కన) ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పుంటించుకుంది. దీంతో బాలిక అక్కడిక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున వాకింగ్కు వచ్చిన స్థానికులు బాలిక మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ, పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం డాగ్స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మల్కాజ్గిరి ఏసీపీ శ్యాంప్రసాద్రావు, మల్కాజ్గిరి షీటీం డీసీపీ సలీమా ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.