తొలిసారి.. ఢీ.. Minister Buggana సొంతూరులో గెలుపు ఎవరిదో..!

ABN , First Publish Date - 2021-11-11T05:20:10+05:30 IST

ఎప్పుడూ ఏకగ్రీవం అయ్యేచోట తొలిసారి ఢీ అంటే ఢీ అన్నట్లు ఎన్నికలు జరుగుతున్నాయి.

తొలిసారి.. ఢీ.. Minister Buggana సొంతూరులో గెలుపు ఎవరిదో..!

  • పట్టు బిగించిన టీడీపీ
  • వైసీపీ శ్రేణుల ఉక్కిరిబిక్కిరి
  • ఉత్కంఠగా బేతంచెర్ల ఎన్నికలు

డోన, నవంబరు 10: ఎప్పుడూ ఏకగ్రీవం అయ్యేచోట తొలిసారి ఢీ అంటే ఢీ అన్నట్లు ఎన్నికలు జరుగుతున్నాయి. బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికలు ఈమారు హోరాహోరీగా మారాయి. ఆర్థిక మంత్రి బుగ్గన ఇలాఖాలో మొదటి సారి నువ్వా.. నేనా అన్న రీతిలో టీడీపీ.. వైసీపీ మధ్య పోరు సాగుతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇక్కడ గట్టి పోటినిస్తోంది. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి సొంత నియోజకవర్గం కావడంతో వైసీపీ కూడా తన ప్రతిష్టను నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికలు జిల్లా ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 


పట్టు బిగించిన టీడీపీ

డోన నియోజకవర్గంలోని బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పట్టు బిగిస్తోంది. టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి బాధ్యతలు తీసుకున్న ధర్మవరం సుబ్బారెడ్డికి ఇవి తొలి ఎన్నిక కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆర్థిక మంత్రి సొంత ఊరు బేతంచెర్ల కావడంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారాన్ని ధర్మవరం సుబ్బారెడ్డిని అడిగి తెలుసుకుంటున్నారు. అన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థులను పోటీకి నిలిపినందుకు సుబ్బారెడ్డిని చంద్రబాబు అభినందించారు. అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీనికి తోడు జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబ సభ్యులు, పార్టీ నియోజకవర్గాల ఇనచార్జిలు బేతంచెర్లలోనే మకాం వేశారు. కొత్త ఊపు మీద ఉన్న టీడీపీ ఎన్నికల్లో గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. పార్టీ నియోజకవర్గ ఇనచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పకడ్బందీ వ్యూహాలతో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అధికార పార్టీ బెదిరింపులను తట్టుకుని.. టీడీపీ గట్టి పోటీనిస్తుండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 


వైసీపీకి సవాల్‌

బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికలు వైసీపీకి సవాల్‌గా మారాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సొంత ఊరు బేతంచెర్ల కావడంతో ఎన్నికలు ఆయనకు చాలెంజ్‌గా మారాయి. బేతంచెర్లలో కొన్ని దశాబ్దాలుగా ఎన్నికలు ఏకగ్రీవం అవుతున్నాయి. తొలిసారిగా నగర పంచాయతీలోని మొత్తం 20 వార్డులలో పోటీ తప్పనిసరి అయింది. ఇది వైసీపీని కలవరపెడుతోంది. అన్ని వార్డుల్లో పోటీ ఉండడం వైసీపీ శ్రేణులను ఉక్కిరి బిక్కిరి చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 


పీఠం ఎవరిదో..

బేతంచెర్ల నగర పంచాయతీ పీఠం ఎవరికో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎన్నికల పలితాలు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ నెలకొంది. నగర పంచాయితీలో 20 వార్డులు ఉండగా, టీడీపీ అభ్యర్థులు అన్ని వార్డుల్లో పోటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థులు  19 వార్డులో బరిలో దిగారు. చైర్మన పదవిని దక్కించుకునేందుకు టీడీపీ, వైసీపీ ఎత్తులు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. నిత్యావసర సరకుల ధరలను, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - 2021-11-11T05:20:10+05:30 IST