Harbhajan Singh: గల్ఫ్ మోసగాళ్ల చెర నుంచి 21 ఏళ్ల యువతిని కాపాడిన హర్భజన్ సింగ్.. నెట్టింట ప్రశంసలు

ABN , First Publish Date - 2022-09-08T16:14:36+05:30 IST

భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ (Harbhajan Singh)పై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది.

Harbhajan Singh: గల్ఫ్ మోసగాళ్ల చెర నుంచి 21 ఏళ్ల యువతిని కాపాడిన హర్భజన్ సింగ్.. నెట్టింట ప్రశంసలు

ఎన్నారై డెస్క్: భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ (Harbhajan Singh)పై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. దీనికి కారణం ఆయన చేసిన ఓ మంచి పని. ఏజెంట్ మోసంతో గల్ఫ్ దేశం ఒమన్‌ (Oman)లో చిక్కుకున్న 21 ఏళ్ల పంజాబ్ యువతిని యజమాని చెర నుంచి కాపాడి స్వదేశానికి తీసుకురావడంలో భజ్జీ కీలకంగా వ్యవహరించాడు. అక్కడి మన ఎంబసీ (Embassy) సాయంతో ఆమెను సురక్షితంగా భారత్‌కు చేరుకునేలా చేశాడు. ఇక ఇటీవల పంజాబ్ నుంచి ఆయనను అక్కడి అధికార పార్టీ ఆప్ (APP) రాజ్యసభకు ఎంపీగా నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఎంపీగా ఉన్న భజ్జీకి ఆప్ నేతల ద్వారానే ఒమన్‌లో చిక్కుకున్న యువతి విషయం తెలిసింది. వెంటనే ఆయన చొరవ తీసుకుని యువతిని స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాటు చేశాడు. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌కు చెందిన కమల్జీత్ (21) తండ్రి సికిందర్ సింగ్ దినసరి కూలీ. ఆయనకు ముగ్గురు కూతుళ్లు. వారిలో పెద్దమ్మాయే కమల్జీత్. తండ్రికి వచ్చే సంపాదన అంతంతమాత్రమే కావడంతో తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కమల్జీత్ నిర్ణయించుకుంది. దాంతో స్థానికంగా ఉండే ఏజెంట్ జసీర్ సింగ్‌ను కలిసింది. తనకు విదేశాల్లో ఏదైనా పని ఉంటే చూపించాలని కోరింది. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ఏజెంట్ జసీర్ మోసపూరితంగా ఆమెను ఒమన్ పంపించే ఏర్పాటు చేశాడు. అక్కడ ఉండే ఓ హిందూ ఫ్యామిలీ వద్ద వంట చేసి పెట్టాలని చెప్పాడు. మంచి జీతం, వసతి ఉంటాయని బుకాయించాడు. అక్కడ నీవు మంచిగా పని చేసుకుంటే.. సిక్కు కమ్యూనిటీ ఎక్కువగా ఉండే కెనడా, ఆస్ట్రేలియా (Australia)కు పంపిస్తాని నమ్మబలికాడు. 


జసీర్ మాటలు నమ్మిన కమల్జీత్ అతగాడి సూచనతో గత నెలలో ఒమన్ వెళ్లింది. కానీ, అక్కడికి వెళ్లాక ఆమెకు వింత అనుభవం ఎదురైంది. కమల్జీత్‌ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి తీసుకెళ్లి ఓ రూంలో బంధించాడు. ఆమె పాస్‌పోర్టు, సిమ్‌కార్డును లాక్కున్నాడు. అనంతరం ఆమెతో బుర్ఖా ధరింపజేసి, అరబ్బి నేర్చుకోవాలని బలవంతం చేశాడు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన కమల్జీత్ ఎలాగోలా అతడి చెర నుంచి బయటపడింది. అనంతరం ఓ కొత్త సీమ్‌కార్డు కొనుగోలు చేసి తండ్రికి ఫోన్ ద్వారా తనకు జరిగిన మోసాన్ని తెలియజేసింది. 


కూతురి సమాచారంతో తండ్రి సికిందర్ సింగ్ వెంటనే ఏజెంట్ సికిందర్‌ను కలిశాడు. తన కూతురిని స్వదేశానికి రప్పించాలని కోరాడు. దానికి అతగాడు ఏకంగా రూ. 2.5లక్షలు డిమాండ్ చేశాడు. చేసేదేమిలేక తన ఇంటిని తాకట్టుపెట్టి ఏజెంట్‌కు ఆ నగదును ఇచ్చాడ. ఆ తర్వాత తన బంధువైన ఆప్ నేత ద్వారా ఈ విషయాన్ని హర్భజన్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన భజ్జీ మస్కట్‌లోని భారత ఎంబసీ అధికారులకు ఫోన్ ద్వారా విషయాన్ని తెలియజేశాడు. దాంతో ఎంబసీ అధికారులు రంగంలోకి దిగి కమల్జీత్‌ను స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేశారు. 


అలా హర్భజన్, ఎంబసీ అధికారుల సహాయంతో కమల్జీత్ తాజాగా పంజాబ్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా భజ్జీతో పాటు ఎంబసీ అధికారులకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది. తిరిగి స్వదేశానికి వస్తానని అనుకోలేదని, ఎంపీ హర్భజన్ సాయం ఎప్పటికీ మరిచిపోలేనని కమల్జీత్ చెప్పుకొచ్చింది. ఇక భజ్జీ మాట్లాడుతూ ఆప్ నేతల ద్వారా విషయం తెలుసుకుని తనవంతు సాయం చేసినట్లు తెలిపాడు. ఇందులో ఎంబసీ అధికారులు కీలకంగా వ్యవహరించారని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు, అందులోనూ ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండాలని భజ్జీ సూచించాడు.    


Updated Date - 2022-09-08T16:14:36+05:30 IST