వికారాబాద్ డీఎంహెచ్వోపై మాజీమంత్రి ప్రసాద్కుమార్ ఆగ్రహం
ABN , First Publish Date - 2022-05-21T05:39:44+05:30 IST
వికారాబాద్ డీఎంహెచ్వోపై మాజీమంత్రి ప్రసాద్కుమార్ ఆగ్రహం
వికారాబాద్, మే 20 : భూతవైద్యుడి నిర్వాకంతో కాళ్లు, చేయికి తీవ్ర గాయాలైన అశ్వినిని నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించడంపై మాజీ మంత్రి ప్రసాద్కుమార్ వికారాబాద్ డీఎంహెచ్వో తుకారాంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అశ్విని ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు హైదరాబాద్లోని నిమ్స్కు రిఫర్ చేసి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి ప్రసాద్కుమార్ డీహెచ్హెచ్వో తుకారాంతో ఫోన్లో మాట్లాడారు. అశ్వినిని మెరుగైన వైద్యం నిమిత్తం నిమ్స్కు తరలించడం వల్ల ప్రాణాలకు ప్రమాదం ఉందని, అక్కడ ఆమెకు సంబంధించిన వైద్యం అందుబాటులో లేదని డీఎంహెచ్వోను కోరారు. దీంతో డీఎంహెచ్వో నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో మాజీమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వినికి ఏమైనా అయితే బాధ్యత వహించాలని డీఎంహెచ్వోకు సూచించారు. అనంతరం మంత్రి సబితారెడ్డితో ప్రసాద్కుమార్ మాట్లాడారు. అశ్వినిని నిమ్స్కు బదులుగా అపోలోకు తరలించాలని కోరడంతో మంత్రి సబితాఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించారు. అయితే, అశ్వినికి నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం అందకపోగా, రెండు గంటలపాటు ఆస్పత్రి బయట వాహనంలోనే పడిగాపులు కాశారు.
- మూఢ నమ్మకాలతో ఆరోగ్యం పాడు చేసుకోవద్దు
మూఢనమ్మకాలతో ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. మల్లేశం పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశ్వినిని పరిశీలించి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆయనతో సీపీఎం నాయకులు ఉన్నారు.