మాజీ మంత్రి పుష్పరాజ్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2022-07-29T09:51:54+05:30 IST

మాజీ మంత్రి పుష్పరాజ్‌ కన్నుమూత

మాజీ మంత్రి పుష్పరాజ్‌ కన్నుమూత

ఎన్టీఆర్‌ పిలుపుతో అధ్యాపక వృత్తి వదిలి రాజకీయాల్లోకి

రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు

వెంకయ్య, చంద్రబాబు, లోకేశ్‌, అచ్చెన్న సంతాపం

మాజీ మంత్రి పుష్పరాజ్‌ కన్నుమూత


గుంటూరు/అమరావతి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు జువ్వికుంట రత్న పుష్పరాజ్‌ (66) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల గుంటూరు వచ్చి పరామర్శించారు. లెక్చరర్‌గా పనిచేసిన పుష్పరాజ్‌ 1983లో టీడీపీలో చేరారు.  నిబద్ధతతో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారు. 1983, 85, 99లో తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో క్రీడా శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అదే కాలంలో అంచనాల కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 1994లో తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. 1995లో ఎన్టీఆర్‌ పాలనా కాలంలో ఒకసారి, 1997లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మరోసారి ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ చీలిక సమయంలో ఆయన చంద్రబాబు వెంట నడిచారు. 1999లో చంద్రబాబు ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశారు. పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా ఆయన పార్టీకి సేవలు అందించారు. 


నిబద్ధత గల నేత: చంద్రబాబు

పుష్పరాజ్‌ మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశా రు. నిబద్ధత, నిజాయితీతో పుష్పరాజ్‌ చేసిన రాజకీయం నేటి యువతకు ఆదర్శమన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పుష్పరాజ్‌ మృతి టీడీపీకి తీరని లోటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పుష్పరాజ్‌ ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించే వారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ఆయన కుటుంబసభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన పుష్పరాజ్‌ తనకు వ్యక్తిగతంగా సుపరిచితులని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయన మృతికి విచారం వ్యక్తంచేసిన ఉపరాష్ట్రపతి.. కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.


ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు?

గుంటూరు, జూలై 28: మాజీ మంత్రి పుష్పరాజ్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున.. కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డికి గురువారం రాత్రి లేఖ రాశారు. పుష్పరాజ్‌ మంత్రిగా దళిత వర్గాలకు సేవ చేసిన దృష్ట్యా అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు అవకాశం కల్పించాలని కోరారు. కాగా.. పుష్పరాజ్‌ అంత్యక్రియలు ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామంలో శుక్రవారం నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - 2022-07-29T09:51:54+05:30 IST