కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు 3 ఏళ్ల జైలు
ABN , First Publish Date - 2020-10-27T06:53:50+05:30 IST
వాజ్పేయి కేబినెట్లో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దిలీప్ రేకు, మరో ఇద్దరు అధికారులకు సీబీఐ
వాజ్పేయి హయాంలో బొగ్గు కుంభకోణం
న్యూఢిల్లీ, అక్టోబరు 26: వాజ్పేయి కేబినెట్లో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దిలీప్ రేకు, మరో ఇద్దరు అధికారులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలుశిక్ష విధించింది. జార్ఖండ్లో 105 హెక్టార్ల బొగ్గు బ్లాక్ను అక్రమంగా కోల్కతాకు చెందిన క్యాస్ట్రాన్ కంపెనీకి కేటాయించిన కేసులో ఈ ముగ్గురినీ దోషులుగా నిర్ధారిస్తూ ఈ నెల 14న ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. సోమవారం శిక్ష ఖరారు చేసింది.
1999లో దిలీప్ రే కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి ఇరవయ్యేళ్లకు నిందితులకు శిక్ష పడింది. ప్రస్తుతం దిలీప్ రేకు 66 ఏళ్లు కాగా, అప్పటి అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతమ్లకు 80 ఏళ్లు. క్యాస్ట్రాన్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్కు కూడా మూడేళ్ల జైలు శిక్ష పడింది. నిందితులందరికీ హైకోర్టుకు అప్పీలు చేసేందుకు అనుమతిస్తూ సీబీఐ కోర్టు బెయిలు మంజూరు చేసింది.
మాజీ మంత్రికి పది లక్షలు, మాజీ అధికారులకు చెరో 2 లక్షలు, కంపెనీ ఎండీకి రూ.60 లక్షలు, కంపెనీకి రూ.70 లక్షలు జరిమానా విధించింది. తవ్విన బొగ్గును ప్రభుత్వానికే అప్పగించినందున ఎలాంటి నష్టం జరగలేదని నిందితులు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు.
కాగా, ఏడాదికి మిలియన్ టన్ను కన్నా తక్కువ సామర్థ్యమున్న ఉక్కు కర్మాగారాలకు క్యాప్టివ్ బొగ్గు గనులు ఇవ్వరాదని మంత్రిగా విధివిధానాలు ఖరారు చేసిన దిలీప్ రే ఆ నిబంధనను ఉల్లంఘించారు.