మాజీల చూపు.. కాంగ్రెస్ వైపు!
ABN , First Publish Date - 2022-06-25T05:56:51+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ఉమ్మడి జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అభ్యర్థిత్వాలపై ఆశలు పెంచుకున్న నేతలు తమ
ఉమ్మడిజిల్లాలో మొదలైన వలసలు
గులాబీశ్రేణుల్లో కలవరం
ఖమ్మం / కొత్తగూడెం, జూన 24 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ఉమ్మడి జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అభ్యర్థిత్వాలపై ఆశలు పెంచుకున్న నేతలు తమకు అనుకూలమైన దారిని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్కు చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులతోపాటు అసంతృప్తివాదులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ప్రతినియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారు అధికంగా ఉండటం, ఇప్పటికే తమకే అభ్యర్థిత్వాలు ఖాయమని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధీమాతో ఉండటంతో మాజీలు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్లో ఉండడంకంటే ప్రతిపక్ష కాంగ్రెస్లోకి వెళ్లడమే మేలని భావించి ఆదిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కరకగూడెం జడ్పీటీసీ కాంతారావుతోపాటు పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్కు గుడ్బైచెప్పి పీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. గత ఎన్నికల్లో అశ్వారావుపేటలో ఓటమిపాలైన తాటి వెంకటేశ్వర్లు .. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తనకే అభ్యర్థిత్వం దక్కుతుందని భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్, టీడీపీ కూటమినుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరడంతో ఆయనకు నియోజకవర్గ ఇనచార్జ్ బాధ్యతలు అప్పగించారు. తొలుత టీడీపీ తరపున బూర్గంపాడు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అశ్వారావుపేటనుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా తాటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఈ సారి ఎన్నికలు, తన రాజకీయ భవిష్యతను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్లో చేరిన తాటి వెంకటేశ్వర్లు.. అశ్వారావుపేటనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయాలని భావిస్తున్నారు. ఇక పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగాకాంతారావుతో ఉన్న విభేదాల నేపథ్యంలో కరకగూడేనికి చెందిన టీఆర్ఎస్ జడ్పీటీసీ కొమరం కాంతారావు కారు దిగి హస్తం గూటికి చేరారు. గతంలో ఆయన పినపాక నియోజకవర్గంనుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేయాలని భావించగా.. పొత్తులో భాగంగా ఆ సీటు కాంగ్రెస్కు వెళ్లడంతో పోటీచేసే అవకాశాన్ని కోల్పోయారు. దీంతో ఈసారి కాంగ్రెస్ నుంచి పినపాక బరిలో నిలవాలన్న లక్ష్యంతో ముందుచూపుతో టీఆర్ఎస్కు గుడ్బై చెప్పి రేవంతరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. వీరితోపాటు స్థానిక నాయకులుకూడా టీఆర్ఎస్కు బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక ఉమ్మడిజిల్లాలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మరికొందరు మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ప్రతినిధులు, జిల్లా నాయకులు టీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్నారని, సిట్టింగ్లకే అభ్యర్థిత్వాలు ఖాయమైతే కాంగ్రెస్ వైపు వెళ్లాలన్న యోచనలో తమ అనుచరులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు నేతలు రేవంతరెడ్డితో టచలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందుకు రేవంతరెడ్డి కూడా ఉమ్మడి ఖమ్మంజిల్లాపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలో అశ్వారావుపేట నియోజకవర్గంలో భారీ బహిరంగసభ ఉంటుందని, ఆ సభ వేదికగా ఉమ్మడి జిల్లా నుంచి నాయకులు భారీగా కాంగ్రెస్లో చేరబోతున్నారని తాటి వెంకటేశ్వర్లు చేరిక కార్యక్రమంలో రేవంత పేర్కొన్నారు. మొత్తంగా భవిష్యతలో అధికార టీఆర్ఎస్నుంచి కాంగ్రెస్కు భారీగానే చేరికలు ఉంటాయని, ముందుగానే కాంగ్రెస్ గూటికి చేరితే తమకు సీటు ఖాయంగా ఉంటుందని, పలువురు నేతలు, వారి అనుచరులు భావిస్తున్నారని, అందులో భాగంగానే హస్తం గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
తాటిబాటలో ఇంకొందరు..
అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక జడ్పీటీసీ కాంతారావు సహా పలువురు నేతలు కాంగ్రెస్ కండువగా కప్పుకోవడంతో ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కోటకు బీటలు వారుతున్నట్టు అర్థమవుతోంది. పార్టీలో అసంతృప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లాకు చెందిన చాలామంది నేతలు పార్టీని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియనాయక్, జడ్పీ చైర్మనకోరం కనకయ్య మధ్య, కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు మధ్య, పినపాకలో రేగా, పాయం వెంకటేశ్వర్లు మధ్య వర్గపోరు తారస్థాయిలో ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల అశ్వాపురం మండలం మల్లెలమడుగు వద్ద ఇరువర్గాల కార్యకర్తల ఘర్షణ పడటం, కేసులు పెట్టుకోవడం లాంటివి జరిగాయి. అయితే టీడీపీ నుంచి అశ్వారావుపేట ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్లో చేరిన మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు వర్గాల మధ్య వర్గపోరు తీవ్రంగా ఉంది. దీంతో తాటి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.ఇలా జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో వర్గపోరు ఉందని స్పష్టమవుతోంది.