మిర్చి వైపు రైతుల మొగ్గు

ABN , First Publish Date - 2021-07-30T06:05:15+05:30 IST

రైతులు ఈ ఏడాది మిర్చి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల్లో మిర్చి వేశారు. ఈ ఏడాది అది 1.25 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

మిర్చి వైపు రైతుల మొగ్గు
నక్కబొక్కలపాడులో సాగు చేసిన మిర్చి

పెరగనున్న సాగు విస్తీర్ణం

గత ఏడాది లక్ష ఎకరాల్లో సాగు

ఈసారి 1.25లక్షలకు చేరుకునే అవకాశం

మిగిలిన పంటల కంటే అధిక ఆదాయం లభిస్తుండటమే కారణం 


అద్దంకి, జూలై 29 : రైతులు ఈ ఏడాది మిర్చి సాగుపై ఆసక్తి  చూపుతున్నారు. దీంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల్లో మిర్చి వేశారు. ఈ ఏడాది అది 1.25 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. వరి, శనగ తదితర పంటలు సాగు చేసినా లాభాలు రాకపోతుండటంతో ఎక్కువ మంది మిర్చి వైపు మొగ్గుతున్నారు. దానిలోనూ ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ కాలం కలిసి వస్తే ఎకరాకు సరాసరి రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకూ ఆదాయం లభించే అవకాశం ఉంది. దీంతో అత్యధిక శాతం మంది సాధారణ పంటల సాగు నుంచి మిర్చి వైపు దృష్టి సారిస్తున్నారు. గత ఏడాది వాతావరణ ప్రతికూలత, తెగుళ్లు, పురుగుల దాడి కారణంగా మిర్చి దిగుబడులు కొంత మేర తగ్గాయి. తేజ రకం ప్రారంభంలో క్వింటా రూ.15 వేలు ఉండగా తరువాత రూ.14 వేలకు తగ్గింది. ఇక నాటు రకం మిర్చి ప్రారంభంలో క్వింటా రూ.13 వేలు ఉండగా అనంతరం రూ.11,500 పడిపోయింది. అయినప్పటికీ రైతులకు పెట్టుబడులుపోను ఎకరాకు సరాసరిన రూ.50వేల నుంచి రూ.లక్ష వరకూ మిగిలాయి. ఇక దిగుబడులు పెరిగి ధరలు బాగా ఉంటే మూడు లక్షల వరకూ ఆదాయం లభించే అవకాశం ఉంది. మిగిలిన ఏపంట సాగు చేసినా ఎకరాకు కనీసం రూ.10 వేలు కూడా మిగలడం లేదు. దీంతో అత్యధిక గ్రామాల్లో రైతులు మిర్చి సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవడంతో అద్దంకి ప్రాంతంలో మాగాణి  పొలాల్లో సైతం మిర్చి సాగు చేస్తున్నారు. 


Updated Date - 2021-07-30T06:05:15+05:30 IST