నీరున్నా వరిసాగుపై నిరాసక్తత
ABN , First Publish Date - 2021-12-05T04:55:29+05:30 IST
పెరుగుతున్న పెట్టుబడులు, లభించని గిట్టుబాటు ధర, కౌలు ధరలు అధికంగా ఉండడం తదితర కారణాలతో ఏడాదికేడాది వరి సాగుపై ఆసక్తి
ఉదయగిరి రూరల్, డిసెంబరు 4: పెరుగుతున్న పెట్టుబడులు, లభించని గిట్టుబాటు ధర, కౌలు ధరలు అధికంగా ఉండడం తదితర కారణాలతో ఏడాదికేడాది వరి సాగుపై ఆసక్తి చూపడం లేదు. తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో చెరువులు, జలాశయాల్లో జలకళ సంతరించుకోవడంతోపాటు భూగర్భజలమట్టం పెరిగింది. అయినా వరి సాగు కాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. గతంలో ఎకరా పొలం దుక్కి దున్నేందు కు రూ.1500, దమ్ముకు రూ.3 వేలు, నారు, కూలీలు, ఎరువులు, పురుగుమందులు కలిపి రూ.20 వేల వరకు ఖర్చయ్యేది. ఆరుగాలం కష్టపడి పండించినా 25-30 బస్తాల దిగుబడి మాత్రమే వస్తుంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎకరాకు రూ.10 నుంచి రూ.12 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. వరికుంటపా డు, ఉదయగిరి మండలాలకు గండిపాళెం జలాశయం వరప్రసాదిని. జలాశయం కింద 16 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయినా రైతు లు 2000-2500 ఎకరాల్లోపే వరి పంట సాగు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 274 చెరువులకు జలకళ సంతరించుకొంది. ఆయా చెరువుల కింద 47,714.6 హెక్టార్ల ఆయకట్టు ఉంది. రబీ సీజన్లో జిల్లాలో 7 నుంచి 8 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది 5 నుంచి 6 లక్షల్లో మాత్రమే వరి సాగ వుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.