రైతులకేది సంక్రాంతి?
ABN , First Publish Date - 2021-01-14T06:30:05+05:30 IST
రైతుల ఇళ్ల ముంగిట సంక్రాంతి శోభ కనిపించడం లేదు. రైతులను ప్రకృతి కొంత నష్టం చేకూర్చితే.. ప్రభుత్వం మరికొంత, దళారులు, వ్యాపారులు ఇంకొంత నష్టం చేకూరుస్తున్నారు. సంక్రాంతి పండుగ సమయానికి ఖరీఫ్, రబీలో పండించిన పంట ఇంటికి చేరుతుంది.
వరుస వర్షాలతో నష్టపోయిన అన్నదాత
అరకొరగా దిగుబడులు
పంటకు కనీస మద్దతు ధర కల్పించలేని ప్రభుత్వం
నిబంధనలతో పరిమితంగా కొనుగోలు
తక్కువ ధరకు బయట మార్కెట్లో
అమ్ముకుంటున్న దుస్థితి
అన్నదాతల ఇంట కానరాని సంక్రాంతి లక్ష్మి
అనంతపురం వ్యవసాయం, జనవరి 13 : రైతుల ఇళ్ల ముంగిట సంక్రాంతి శోభ కనిపించడం లేదు. రైతులను ప్రకృతి కొంత నష్టం చేకూర్చితే.. ప్రభుత్వం మరికొంత, దళారులు, వ్యాపారులు ఇంకొంత నష్టం చేకూరుస్తున్నారు. సంక్రాంతి పండుగ సమయానికి ఖరీఫ్, రబీలో పండించిన పంట ఇంటికి చేరుతుంది. ఈసారి ఆశించిన స్థాయిలో పంటలు పండలేదు. వరుస వర్షాలతో ఈ ఏడాది ప్రధాన పంటలు ఏపుగా పెరిగినా దిగుబడి రాలేదు. పెట్టుబడి ఖర్చులు కూడా రాక పోవడంతో అన్నదాతలు నిట్టూరుస్తున్నారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించలేకపోతోంది. దీంతో తక్కువ ధరకే బయట మార్కెట్లో అ మ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా కొందరు వ్యాపారులు ఉడాయిస్తు న్నారు. ఇలా పలు రకాలుగా రైతులు దగాకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు సంక్రాంతి పండుగను సాదాసీదాగా కానిచ్చే స్తున్నారు.
వరుస వర్షాలతో తీవ్ర నష్టాలు
గతేడాది ఖరీఫ్లో 6.22 లక్షల హెక్టారల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో 4.94 లక్షల హెక్టార్లల్లో వేరుశనగ సాగు చేశారు. మిగిలిన విస్తీర్ణంలో కంది, సజ్జ, వరి, మొక్కజొన్న, జొన్న, కొర్ర, రాగి, పెసలు, ఉలవలు, ప్రత్తి, టమోటా, అరటి తదితర పంటలు సాగు చేశారు. వరుస వర్షాలతో పంటల దిగుబడి తగ్గింది. ఈ సారి ఎకరాకు 2 నుంచి 4 బస్తాల్లోపే వేరుశనగ దిగుబడి వచ్చింది. మిగతా పంటల పరిస్థితి అంతే. రబీ సీజన్లో నల్లరేగడి భూముల్లో 40 వేల హెక్టార్లల్లో పప్పుశనగ సాగు చేశారు. పంట సాగు చేసినప్పటి నుంచి ప్రతికూల వాతావరణంలో దిగుబడి ఆశించిన స్థాయిలో రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మద్దతు ధర ఏదీ?
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రైతులు పండించి న పంటలో 30 శాతం మాత్రమే కొనుగోలు చేసేలా ని బంధనలు విధించారు. ఈ వింత నిర్ణయంతో ఈ సారి మొక్కజొన్న, ఇతర పంటల ఉత్పత్తుల కొనుగోలును పరిమితం చేశారు. నిబంధనలు మార్పు చేసి డి మాండ్కు అనుగుణంగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా 356 రైతు భరోసా కేంద్రాల్లో వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబరు రెండో వారంలో మొదలు పెట్టి అదే నెలలోనే బంద్ చేశారు. ఈ సారి 24 వేల మెట్రిక్ టన్నులు వేరుశనగ కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో గ్రేడ్ -1 రకం వేరుశనగ 290 క్వింటాళ్లు కొన్నారు. కొత్త నిబంధనలతో ఆసరుకును కొనేందుకు నాఫెడ్ నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆసరుకును కొనలేదు. దీంతో రైతులకు తిరిగి వెనక్కి ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. అలాగే గ్రేడ్ -2 రకం వేరుశనగ 258 క్వింటాళ్లు కొన్నారు. ఇప్పటి దాకా వాటికి సంబంధించిన డబ్బులు రైతులకు చెల్లించలేదు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో కొర్రీలతో జిల్లా అన్నదాతకు అన్యాయం చేస్తున్నారు. జిల్లాలోని 8 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రేడ్-1 రకం క్వింటాల్ ధర రూ.5825, గ్రేడ్ -2 రకం క్వింటాల్ రూ.5515గా నిర్ణయిం చారు. బహిరంగ మార్కెట్ కంటే కేంద్రాల్లో ధర బాగుండ టంతో అక్కడే విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే పలు కొర్రీలు పెడుతూ అరకొరగా కొనుగోలు చేయడంతో సరిపెడుతున్నారు. ఇప్పటి దాకా 3646 మంది రైతుల నుంచి 1.12 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. మరోవైపు లక్ష్యం పేరుతో మొక్కజొన్న కొనుగోలు బంద్ చేశారు. జిల్లాలో గతేడాది నవంబరు మూడో వారం నుంచి మొక్కజొన్న కొనుగోలు ఆరంభించారు. డిసెంబరు నెలాఖరుతో బంద్ చేశారు. తొలుత 20,550 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అదనంగా 7 వేల క్వింటాళ్లు కొనేందుకు అనుమతించాలని ప్రతిపాదనలు పంపారు. అయితే 5 వేల క్వింటాళ్లకు అనుమతించిన మరుసటి రోజే కొనుగోలు గడువు ముగియడంతో కొనుగోలు బంద్ చేశారు. గడువులోగా 23,460 క్వింటాళ్ల మొక్కజొన్న కొనడంతో సరిపెట్టారు. మిగిలిన పంటలను అరకొరగానే కొనుగోలు చేశారు. సజ్జ 1415 క్వింటాళ్ల లక్ష్యానికి 260 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. కొర్ర 359 క్వింటాళ్లకు 11.65 క్వింటాళ్లు, రాగి 1962 క్వింటాళ్లకు 7.8 క్వింటాళ్లు కొనుగోలు చేయడంతో సరిపెట్టారు.
సగం డబ్బులే ఇచ్చారు
10 ఎకరాల సొంత పొలంతోపాటు ఏడెకరాలు కౌలుకు తీ సుకొని సాగు చేస్తున్నా. సంవత్సరం కిందట 120 క్వింటాళ్ల పత్తి ని వ్యాపారికి విక్రయించా. రూ.6 లక్షలు రావాల్సి ఉండగా రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగ తా డబ్బులు ఇవ్వలేదు. ఎప్పుడిస్తాడో ఏమో అ ర్థం కావడం లేదు.
- రైతు ప్రతాప్రెడ్డి, పి. కొట్టాలపల్లి, పెద్దవడుగూరు మండలం
మొక్కజొన్న కొనలేదు..
7 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. 60 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. బయట ధర తక్కువ గా ఉండటంతో కొనుగోలు కేంద్రం లో అమ్మేందుకు పేరు నమోదు చేసుకున్నా. ఎప్పుడు వెళ్లినా ఫోన్ చేస్తామని చెబుతూ వచ్చారు. డిసెంబరు నెలాఖరులో ఉన్నట్లుండి కేం ద్రాన్ని బంద్ చేశారు. అలాట్మెంట్ రాలేదంటూ కొనడం లేదు. ఇదెక్కడి అన్యాయమో అర్థం కావ డం లేదు. అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
- కృష్ణానాయుడు, చిన్నపల్లి, తాడిపత్రి మండలం
రైతులను మోసం చేయకుండా చర్యలు తీసుకోవాలి
8 ఎకరాలు ప్రత్తి సాగు చేసుకుంటున్నా. నాకు రూ.6.40 లక్షలు ఇవ్వాల్సి ఉంది. డబ్బులు ఇవ్వకుండా వ్యాపారి మోసం చేశాడు. ఎప్పుడు డబ్బులు ఇస్తారో ఏమో భయంగా ఉంది. రైతులను ఇలా మోసం చేయ కుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
- రైతు బైదీశ్వరరెడ్డి, పి. కొట్టాలపల్లి, పెద్దవడుగూరు మండలం
కొద్ది పాటి పంటనే కొనలేదు
4.5 ఎకరాల్లో వేరుశనగ వేశా. వరుస వర్షాలతో ది గుబడి సరిగా రాలేదు. 30 బస్తాలు దిగుబడి వ చ్చింది. ఆ పంటను కూడా కొనుగోలు కేంద్రంలో కొనలేదు. ఎప్పుడు వెళ్లినా ఎదో ఒక కారణం చె బుతూ వాయిదాలు వేశారు. ఇప్పుడేమో కేంద్రాన్నే పూర్తిగా బంద్ చేశారు.
- రైతు రామకృష్ణారెడ్డి, వెన్నపూసపల్లి, యాల్లనూరు మండలం