సచివాలయ ప్రాంగణంలో చర్చినిర్మాణానికి శంకుస్ధాపన

ABN , First Publish Date - 2022-04-28T23:10:23+05:30 IST

తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి చిహ్నంగా, గంగా జమున తహజీబ్ కు వేదికగా నిలిచిందని ఎంఎల్సీ రాజేశ్వర్ రావు అన్నారు.

సచివాలయ ప్రాంగణంలో చర్చినిర్మాణానికి శంకుస్ధాపన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మత  సామరస్యానికి చిహ్నంగా, గంగా జమున తహజీబ్ కు వేదికగా నిలిచిందని ఎంఎల్సీ రాజేశ్వర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సర్వమత సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ అత్యధిక ప్రాధాన్యతనిస్తూన్నారని అన్నారు.దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత అందమైన, విశాలమైన చర్చి నిర్మాణాలు లేవని ముఖ్యమంత్రిని కొనియాడారు. అందమైన సచివాలయ చర్చి నిర్మాణం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. గురువారం నాడు తెలంగాణ  రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో పునర్నిర్మాణానికి  మెదక్ డయెసిస్ బిషప్ రెవరెండ్ డా.ఎ.సి.సాలమన్, ఎంఎల్సీ రాజేశ్వర్ రావు లు శంఖుస్థాపన చేశారు. బిషప్ సాలమన్ ప్రత్యేక ప్రార్థనలతో నూతన చర్చి నిర్మాణ పనులు ప్రారంభించారు. కొత్త సెక్రటేరియట్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా శంఖుస్థాపన కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహించారు.


రాష్ట్ర ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ లో రూ. 1.5 కోట్లతో నిర్మిస్తున్న చర్చి కోసం 500 గజాల స్థలం కేటాయించింది. ప్రభుత్వ ఖర్చుతో విశాలమైన ప్రదేశములో ప్రార్థనా మందిరాన్ని అందంగా పునర్ నిర్మిస్తున్నందుకు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు.ఎంఎల్సీ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ క్రైస్తవ మైనారిటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. షాదీముబారక్ పథకం ద్వారా క్రైస్తవ మహిళలు లబ్దిపొందుతున్నారని, చర్చి నిర్మాణాల అనుమతులను ప్రభుత్వం సరళం చేసిందని చెప్పారు. 


బిషప్ రెవరెండ్ ఎ.సి. సాల్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లౌకికవాదాన్ని కాపాడుతూ, అన్ని మతాల వారిని సమానంగా చూస్తున్నారని అన్నారు. చర్చి స్థలము, నిర్మాణ ఖర్చులను ప్రభుత్వమే భరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఆర్ అండ్ బీ ఎస్.ఈ. సత్యనారాయణ చర్చి డిజైన్లను ఉద్యోగులకు చూపించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (ఆర్కిటెక్ట్స్ అండ్ బిల్డింగ్స్) సుద్దాల సుధాకర్ తేజ, ఎంప్లాయిస్ యూనియన్ కు చెందిన ప్రసాద్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. చిట్టిబాబు, బి.జేకబ్ రాస్, జేమ్స్, సునీత, సుష్మ, సౌజన్య, రాజు, రత్నం, మణి, శాస్త్రి తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-28T23:10:23+05:30 IST