America: 8 నెలల పాప సహా నలుగురు భారతీయుల కిడ్నాప్.. కాలిఫోర్నియా పోలీసులు ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2022-10-05T17:30:36+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని మెర్సిడ్లో శనివారం గుర్తు తెలియని వ్యక్తులు భారత సంతతికి చెందిన నలుగురిని అపహరించారు. కిడ్నాప్ అయిన వారిలో ఓ 8 నెలల పసికందు కూడా ఉంది. అపహరణకు గురైనవారిలో జస్దీప్ సింగ్, జస్లీన్ కౌర్, చిన్నారి ఆరూహీ ధేరీ, అమన్దీప్ సింగ్ ఉన్నట్లు కాలిఫోర్నియా పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, కిడ్నాప్ జరిగిన ప్రదేశం అనేక రెస్టారెంట్లు, షాపులతో ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం అయినప్పటికీ ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు దారితీస్తోందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల గురించి తెలిసిన వారు అత్యవసర నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. కాగా, 2019లో ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది. కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన తుషార్ ఆత్రే అనే వ్యక్తి అపహరణకు గురయ్యాడు. అతడిని ఇంటి నుంచి కిడ్నాప్ చేసిన కొన్ని గంటల తర్వాత తన ప్రియురాలి కారులో మృతిచెంది కనిపించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా కిడ్నాప్కు గురైన నలుగురి విషయంలో పోలీసులు చాలా చాకచక్యంగా దర్యాప్తు చేస్తున్నారు.