చతుర్విధ భక్తులు

ABN , First Publish Date - 2022-06-24T06:27:02+05:30 IST

క్తులు నాలుగు రకాలుగా ఉంటారని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మొదటి రకం భక్తులు తమ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి, బాధల నుంచి బయటికి రావాలని కోరుకుంటారు.

చతుర్విధ భక్తులు

క్తులు నాలుగు రకాలుగా ఉంటారని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మొదటి రకం భక్తులు తమ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి, బాధల నుంచి బయటికి రావాలని కోరుకుంటారు. రెండో రకం భక్తులు భౌతికమైన వస్తువులనూ, లౌకికమైన సంతోషాలనూ ఆశిస్తారు. స్త్రీ-పురుష వ్యత్యాసాలు, సంస్కృతులు, విశ్వాసాలతో నిమిత్తం లేకుండా... ఎక్కువమంది భక్తులు ఈ రెండు విభాగాల్లోకే వస్తారు. ఈ భక్తులకు ఉండే శ్రద్ధ కారణంగా వారి కోరికలు తీరుతాయని చెప్పాడు కృష్ణుడు. దీన్ని శరణాగతికి ఒక రూపంగా చెప్పవచ్చు. 


శ్రద్ధ గురించి ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే... పక్కపక్కనే పొలాలు ఉన్న ఇద్దరు రైతులు... తమ పంటలకు నీరు అందించడం కోసం బావులు తవ్వాలనుకున్నారు. మొదటి రైతు ఒకటి, రెండు రోజులు తవ్వాడు. కానీ నీరు పడలేదు. దాంతో ఆ ప్రదేశాన్ని వదిలి మరో చోట తవ్వడం మొదలుపెట్టాడు. రెండో రైతు మాత్రం ఎక్కడ ప్రారంభించాడో... అక్కడే తవ్వకం కొనసాగించాడు. ఒక నెల గడిచేసరికి... మొదటి రైతు పొలం గోతుల్తో నిండిపోయింది. రెండో రైతు లోతుగా తవ్విన చోట నీరు పడింది. ఈ కథలో నీటిలా... మన ఇంద్రియాలకు ఏదీ కనిపించకపోయినప్పటికీ... రెండో రైతులా... అంతర్గతమైన శ్రద్ధ మనల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రద్ధ అంటే నిర్భయమైన సానుకూలమైన శక్తి. అది సందేహానికి అతీతమైనది. విజయాన్ని ఫలితంగా అందించే ఆ శ్రద్ధ వెనుక నేను ఉన్నానని కృష్ణుడు సూచించారు. మన సంబంధాల్లో, కుటుంబ బంధాల్లో, వృత్తిలో కనబరిచే శ్రద్ధకు అద్భుతాల్ని సాధించే శక్తి ఉంటుంది. 


ఇక మూడో రకం భక్తుడు కోరికల సరిహద్దును దాటుతున్న స్థితిలో ఉన్నాడు. అతను కుతూహలం గలిగిన మనిషి. స్వీయ జ్ఞానాన్ని అతను కోరుకుంటాడు. నాలుగో రకం భక్తుడు జ్ఞాని. అతను కోరికల సరిహద్దును దాటేశాడు. అతను ప్రతిదానిలో, ప్రతి చోటా భగవంతుణ్ణే చూస్తాడు. పరమాత్మతో ఐక్యతను సాధిస్తాడు.

కె.శివప్రసాద్‌, ఐఎఎస్‌

Updated Date - 2022-06-24T06:27:02+05:30 IST