లక్కీ స్కీం పేరిట మోసం
ABN , First Publish Date - 2021-05-11T05:03:56+05:30 IST
లక్కీ స్కీం పేరిట మోసం
- ఇద్దరిపై కేసు నమోదు
కీసర: లక్కీ స్కీం పేరిట ప్రజలను మోసంచేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కీసర గ్రామానికి చెందిన కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ ఖాదీర్, గులాం సాధిక్లు కలిసి అక్టోబర్ 2020 సంవత్సరంలో ఎస్పీకే ఎంటర్ప్రైజెస్ పేరిట లక్కీ స్కీం ప్రారంభించారు. స్కీంలో 18 నెలలు, నెలకు రూ.1,000 చెల్లిస్తే, ప్రతినెలా తీసే డ్రాల్లో విలువైన బహుమతులు పొందవచ్చని ప్రజలకు మాయమాటలు చెప్పి దాదాపు 3వేల మందిని స్కీంలో సభ్యులుగా చేర్చారు. ఇలా ప్రతినెలా డ్రా తీసేందుకు ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. డ్రాలో భాగంగా నిర్వహకులు 40మంది ఏజెంట్లను నియమించుకున్నారు. కాగా సమీర్ అనే ఏజెంట్ ద్వారా కృష్ణవేణి స్కీంలో సభ్యురాలిగా చేరింది. సోమవారం మండల కేంద్రం కీసరలోని జీపీఆర్ ఫంక్షన్హాల్లో డ్రా తీసి విజేతలను ప్రకటించారు. కాగా స్కీంను చట్ట విరుద్ధంగా, ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్నారని, నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిర్వాహకులపై 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ నరేందర్గౌడ్ తెలిపారు.