ఫేస్బుక్ పట్టించింది
ABN , First Publish Date - 2022-08-12T06:05:27+05:30 IST
మ్యాట్రీమనీ ద్వారా పరిచయమయ్యాడు. ఢిల్లీలో ఉద్యోగమని నమ్మబలికాడు. తనకు ఇదివరకే వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లిపీటల దాకా తెచ్చాడు. తీరా వివాహ ముహూర్తానికి ఒకరోజు ముందు వరుడి మోసం ఫేస్బుక్ వేదికగా వెలుగుచూసింది. దీంతో పెళ్లి పెటాకులైంది.
పెళ్లి పేరిట మోసం
మ్యాట్రీమనీ ద్వారా పరిచయం
వరుడికి ఇంతకు ముందే వివాహం
ఆలస్యంగా తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు
ఒక్కరోజు ముందు ఆగిన వేడుకలు
కొత్తూరు,
ఆగస్టు 11: మ్యాట్రీమనీ ద్వారా పరిచయమయ్యాడు. ఢిల్లీలో ఉద్యోగమని
నమ్మబలికాడు. తనకు ఇదివరకే వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టాడు. ఇరు
కుటుంబాల అంగీకారంతో పెళ్లిపీటల దాకా తెచ్చాడు. తీరా వివాహ ముహూర్తానికి
ఒకరోజు ముందు వరుడి మోసం ఫేస్బుక్ వేదికగా వెలుగుచూసింది. దీంతో పెళ్లి
పెటాకులైంది. కొత్తూరులో వెలుగుచూసిన ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
కొత్తూరు మండలం పారాపురం గ్రామానికి చెందిన ఓ యువతి బీఎస్సీ పూర్తి
చేసింది. ఆమెకు వివాహం చేయాలని తల్లిదండ్రులు భావించారు. ఆన్లైన్లో వివాహ
పరిచయ వేదిక (మ్యాట్రీమనీ)ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో
నెల్లూరు జిల్లా ఉలవలపాడుకు చెందిన బడతల సాయిసందీప్.. మ్యాట్రీమనీ ద్వారా
యువతి ఫోన్ నెంబర్ సేకరించి.. ఆమెతో మాట్లాడాడు. ఢిల్లీలోని స్పిన్
కంపెనీ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. మంచి జీతభత్యాలుగా చెప్పుకొచ్చాడు.
దీంతో ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడి వివాహ అంగీకారానికి వచ్చారు. ఆగస్టు
11న (గురువారం) వివాహ ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల
విశాఖలో ఉన్న యువతి బంధువు విజయకు ఆహ్వాన పత్రికను పంపించారు. అయితే
సాయిసందీప్ ఫొటో చూసిన ఆమె అనుమానంతో ఫేస్బుక్లో ఆయన అకౌంట్ గురించి
అన్వేషించింది. బడతల సాయిసందీప్ పేరుతో ఫేస్బుక్లో వెతకగా.. స్వీటీ
సందీప్ పేరుతో ఆయన ఫొటో ప్రత్యక్షమైంది. పక్కనే ఆయన వేరే అమ్మాయితో ఫొటో
దిగినట్టు కనిపించింది. దీనిపై వివరాలు సేకరించగా సందీప్కి ఇది వరకే
వివాహమైనట్టు తేలింది. సదరు అమ్మాయితో వివాదం జరగడంతో పోలీస్ కేసు కూడా
నమోదైంది. ఈ విషయం తెలియని యువతి కుటుంబ సభ్యులు వివాహానికి నిశ్చయించారు.
అయితే దీనిపై పూర్తి ఆధారాలు సేకరించిన విజయ బుధవారం వాటిని యువతి
కుటుంబసభ్యులకు అందించింది. దీంతో ఆందోళనకు గురైన బాధిత కుటుంబసభ్యులు
స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. కట్నం కింద రూ.2.50
లక్షలు ముందుగానే తీసుకున్నారని.. మోసం చేసి వివాహం చేసుకోవడానికి
ప్రయత్నించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గోవిందరావు తెలిపారు.