గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని 30 లక్షలకు టోకరా
ABN , First Publish Date - 2021-05-18T12:25:39+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని
హైదరాబాద్/కరీంనగర్ క్రైం : ప్రభుత్వ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి వద్ద రూ.30 లక్షల వరకు తీసుకుని మోసానికి పాల్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్కు చెందిన మేదరి గుడికంటి ఆనంద్బాబు(40)పై కరీంనగర్ టాస్క్ఫోర్స్, ఒకటో ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ లక్డీకాపూల్లో ఆనంద్బాబు ఎంజీఆర్ ట్రేడర్స్, కన్సల్టెన్సీ పేరిట ఆఫీస్ తెరిచాడు. కరీంనగర్ క్రిస్టియన్ కాలనీకి చెందిన సందవేని శ్రీనివా్సకు అతని స్నేహితుడు సదానందం ద్వారా ఆనంద్బాబు పరిచయమయ్యాడు. మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న శ్రీనివాస్ తనకు ఉద్యోగం కావాలని కోరాడు. కరీంనగర్ మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని, రూ.10 లక్షలు డిమాండ్ చేసి మొదట రూ.5లక్షలు, ఉద్యోగం వచ్చిన తరువాత మరో రూ.5 లక్షలు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు.
ఇందులో భాగంగా 2019 జూన్ 26న కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ముందే గొంటి తిరుపతి అనే స్నేహితుడి సమక్షంలో శ్రీనివాస్ రూ.5 లక్షలు ఆనంద్బాబుకు ఇచ్చాడు. రెండు నెలల్లో ఉద్యోగం వస్తుందని చెప్పిన ఆనంద్బాబు తప్పించుకు తిరిగాడు. మరో నెలలో ఆపాయింట్మెంట్ లెటర్ వస్తుందని, మరో రూ.2 లక్షలు కావాలని ఆనంద్బాబు అడగగా అతని బ్యాంక్ ఖాతాకు డబ్బును ట్రాన్స్ఫర్ చేశాడు. అప్పటి నుంచి ఆనంద్బాబు ఫోన్ ఎత్తకపోవటం, స్విచాఫ్ చేసి ఉండటంతో అనుమానంతో లక్డీకాపూల్ వెళ్లి చూడగా అక్కడ ఆనంద్బాబు ఎంజీఆర్ ట్రేడర్స్, కన్సల్టెన్సీ మూసి ఉంది.
అక్కడి నుంచి కార్యాలయం ఎత్తివేసినట్లు తెలుసుకున్న బాధితుడు శ్రీనివాస్ అతని కోసం గాలించి ఎంతకూ ఆచూకీ దొరకకపోవటంతో కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టాస్క్ఫోర్స్ పోలీసులు సంఘటనపై విచారణ చేపట్టగా నిందితుడు తన కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగులైన శ్రీనివా్సతో పాటు హుజూరాబాద్కు చెందిన ఒక యువకుడి వద్ద రూ.13 లక్షలు, రామగుండంకు చెందిన మరొకరి వద్ద రూ. 6లక్షలు, నిర్మల్కు చెందిన వ్యక్తి వద్ద రూ.4లక్షలు తీసుకున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.