ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
ABN , First Publish Date - 2022-06-29T05:55:46+05:30 IST
ఎన్టీఆర్ అంటే ఆంధ్రరాష్ట్రంలో ఒక సినీ నటుడుగానే కాకుండా, ప్రపంచానికి సంక్షేమం అంటే ఏంటో చూపించిన మహనీయుడు అని, ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాము కూడా అదే బాటలో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
పటమట, జూన్ 28 : ఎన్టీఆర్ అంటే ఆంధ్రరాష్ట్రంలో ఒక సినీ నటుడుగానే కాకుండా, ప్రపంచానికి సంక్షేమం అంటే ఏంటో చూపించిన మహనీయుడు అని, ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాము కూడా అదే బాటలో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం అశోక్నగర్లోని శాసన సభ్యుని కార్యాలయంలో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఉయ్యూరు రోటరీ క్లబ్ సహకారంతో గద్దె నేతృత్వంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 400 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వంద మందికి ఆపరేషన్లు చేయాలని, 250 మందికి కళ్లజోళ్లకు వైద్యులు సూచించారు. మిగిలిన వారికి మందులు అందజేశారు. నేత్ర వైద్య శిబిరాన్ని సీనియర్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు ప్రారంభించారు. వైద్య శిబిరాన్ని రొటేరియన్, అడ్వకేట్ నిమ్మగడ్డ దుర్గాప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఒక్క రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో ఉంటున్న తెలుగువారంతా ఒక పండుగలా జరుపుకోవడం జరుగుతుందన్నారు. కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎంతో మందికి ఉపాధి మార్గాలు, పేద ప్రజల ఫీజులు చెల్లిస్తున్న గద్దెకు నియోజకవర్గ ప్రజల తరఫున జాస్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్లు వి.శిరీషా, ఎ.కృష్ణప్రసాద్, బి.శ్రీనివాస్, ఎల్.జి.ప్రసాద్ నేత్ర పరీక్షలు నిర్వహించారు. జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, కార్పొరేటర్లు పొట్లూరి సాయిబాబు, ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి, పేరేపి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.