వాటర్.. మీటర్..!
ABN , First Publish Date - 2021-01-24T06:44:35+05:30 IST
గ్రేటర్లో ఉచిత తాగునీటి పథకం అమలుపై వాటర్బోర్డు కొన్ని నిబంధనలు జారీ చేసింది.
ఉచిత పథకం వేగవంతం
మీటర్లు అమర్చుకున్న నాటి నుంచే అమలు
తగ్గిన చార్జీలతో ఉపశమనం
హైదరాబాద్ సిటీ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్లో ఉచిత తాగునీటి పథకం అమలుపై వాటర్బోర్డు కొన్ని నిబంధనలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీ వరకు మీటర్లు లేని (మురికివాడలు మిన హా) వారు మీటర్లు అమర్చుకున్న తేదీ నుంచే ఉచిత తాగునీటి పథకం వర్తింపజేయనుంది.
మురికివాడల్లో ఇంటివద్దే నల్లా కనెక్షన్కు సంబంధించిన క్యాన్ నంబర్లకు ఆధార్ కార్డులను అనుసంధానం చేస్తారు. ఇందు కోసం 165 మంది మీటర్ రీడర్లకు శిక్షణ ఇచ్చారు. సాధారణ గృహకనెక్షన్దారులు, అపార్ట్మెంట్లలోని వారు ఆధా ర్, క్యాన్నంబర్లను మీసేవా కేంద్రాల్లో, వాటర్బోర్డు వెబ్సైట్లలో అనుసంధానం చేసుకునేలా వీలు కల్పించారు. ఆధార్కార్డులో ఒకలా, నల్లా కనెక్షన్లో మరోలా పేర్లు ఉన్న వారు వాటర్బోర్డు వెబ్సైట్లో సరిచేసుకునేలా ఏర్పాట్లు చేశారు. మురికివాడలలో క్యాన్ నంబర్కు ఆధార్ అనుసంధానం చేసుకోగానే, డిసెంబర్ నుంచే జీరో బిల్లులు జారీ చేస్తారు.
ఇప్పటికే మీటర్లు ఉన్న కనెక్షన్దారులు ఆధార్ అనుసంధానం చేసుకుంటే, ఏప్రిల్లో మీటర్ రీడింగ్ చూస్తారు. అప్పుడే నాలుగు నెలలకు సంబంధించిన బిల్లులను జారీ చేస్తారు. నెలకు 20 వేల లీటర్లకు మించితే అదనపు వినియోగానికి టారిఫ్ ప్రకారం బిల్లు చెల్లించాలి.
ఏప్రిల్ తర్వాత మీటరు ఏర్పాటు చేసుకుని, ఎప్పుడు ఆధార్తో అనుసంధానం చేసుకుంటే అప్పటి నుంచే పథకం వర్తిస్తుంది. అంతకుముందున్న కాలానికి టా రిఫ్ ప్రకారం బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాలానికి ఎలాంటి వడ్డీ కానీ, జరిమానా కానీ విధించరు.
మార్చి 31 లోపు మీటర్ల బిగింపు, ఆధార్ అనుసంధానం చేసుకోని కనెక్షన్దారులకు డిసెంబర్ నుంచి నాలుగు నెలల కాలానికి సాధారణ బిల్లులు జారీ చేస్తారు. అయితే, వడ్డీ, జరిమానాలు ఉండవు.