వారం రోజులుగా మంచినీటి సరఫరా బంద్‌

ABN , First Publish Date - 2022-05-24T06:56:22+05:30 IST

గ్రామంలో వారం రోజులుగా మంచినీటిని సరఫరా చేయడం లేదని ఆగ్రహించిన గ్రామస్థులు పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.

వారం రోజులుగా మంచినీటి సరఫరా బంద్‌
ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్న మహిళలు

 గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం

 బోర్లు కాలిపోయి వారమైనా స్పందించడం లేదని ఆగ్రహం

 సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో ఘటన

నడిగూడెం, మే 23: గ్రామంలో వారం రోజులుగా మంచినీటిని సరఫరా చేయడం లేదని ఆగ్రహించిన గ్రామస్థులు పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని కరివిరాల గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గార్లపాటి మహేష్‌రెడ్డి, జ్యోతి మాట్లాడుతూ వారం రోజులుగా సగం గ్రామానికి నీరు రావడంలేదని, ఇదేమని అడిగితే సర్పంచ్‌, కార్యదర్శి, సిబ్బంది పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామం లో ఉన్న నాలుగు బోర్లు కాలిపోయినా వాటికి మరమ్మతులు చేయించడం లేదన్నారు. మంచినీరు లేక వ్యవసాయ బోర్లు, బావుల వద్ద నుంచి తెచ్చు కోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 50మంది మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తంచేశారు. సమస్యను పరిష్కరిస్తానని కార్యదర్శి నాగరాజు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు పంచాయతీ కార్యాలయం తాళం తీశారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ బోరు మోటార్లు కాలిపోయాయని దృష్టికి తెసుకెళ్లినా మండల అధికారులు స్పందించడంలేదని తెలిపారు. లక్షలాది రూపాయల బిల్లులు ఆగిపోయాయని, తాము ఏమీ చేయలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మ, మౌనిక, రజని, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:56:22+05:30 IST