Chikkaballapura: చెల్లెలిని ప్రేమించాడని... స్నేహితుడి హత్య
ABN , First Publish Date - 2022-10-03T16:44:26+05:30 IST
చెల్లెలును ప్రేమిస్తున్నాడనే కసితో స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన చిక్కబళ్ళాపుర జిల్లాలో చోటు చేసుకుంది.
బెంగళూరు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): చెల్లెలును ప్రేమిస్తున్నాడనే కసితో స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన చిక్కబళ్ళాపుర జిల్లాలో చోటు చేసుకుంది. చిక్కబళ్ళాపుర(Chikkaballapura) తాలూకా హారోబండ గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా. దొడ్డబళ్ళాపురకు చెందిన నందన్ (21) చిక్క బళ్ళాపురలో అద్దె ఇంట్లో ఉండేవాడు. ఇదే ప్రాంతంలో నివసించే దర్శన్ చెల్లెలును నందన్ ప్రేమించేవాడు. తొలుత వారిద్దరూ స్నేహితులుగా ఉన్నా, చెల్లెల్ని ప్రేమిస్తున్నాడనే కారణంతో పలుమార్లు మందలించాడు. అయినా నందన్లో మార్పు రాకపోవడంతో దర్శన్, ఆశ్రయ్ అనే మిత్రుడితో కలసి నందన్ను విందుకు పిలిచాడు. హారోబండ గ్రామ సమీపంలో ముగ్గురూ మద్యం సేవించారు. ఇదే సందర్భంలో నందన్ మొబైల్లో దర్శన్ చెల్లెలి చాటింగ్ను గుర్తించారు. దీంతో పథకం ప్రకారం నందన్కు ఎక్కువగా మద్యం తాగించారు. ఆ తర్వాత మారణాయుధాలతో 40సార్లకుపైగా శరీరంపై ఇష్టారాజ్యంగా పొడిచి హతమార్చారు. ఆదివారం ఉదయం చిక్కబళ్ళాపుర గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు కారకులైన దర్శన్, ఆశ్రయ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.