బర్త్‌ డే పార్టీ ఇచ్చిన ఫ్రెండ్‌నే బీరుబాటిల్‌తో గొంతుకోసేశారు!

ABN , First Publish Date - 2021-07-11T13:39:43+05:30 IST

పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఇస్తున్న మిత్రుడిపైనే....

బర్త్‌ డే పార్టీ ఇచ్చిన ఫ్రెండ్‌నే బీరుబాటిల్‌తో గొంతుకోసేశారు!

  • కోలుకుంటున్న బాధితుడు... పరారీలో నిందితులు 

హైదరాబాద్ సిటీ/చందానగర్‌ : కొడుకు పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఇస్తున్న మిత్రుడిపైనే ఇద్దరు స్నేహితులు ఆకస్మాతుగా దాడికి దిగారు. బీరుబాటిల్‌తో అతని గొంతుకోశారు. తీవ్ర రక్తస్రావమైన అతను ఈఎన్‌టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన చందానగర్‌లో తీవ్ర కలకలం రేపింది. ఎస్‌ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం... కర్నాటకలోని గుల్బర్గకు చెందిన విజయ్‌కుమార్‌(23) బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చి చందానగర్‌ పరిధిలోని పాపిరెడ్డికాలనీలో నివాసం ఉంటున్నాడు. 


స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య చాముండి, ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు లక్ష్మణ్‌ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం సాయంత్రం మిత్రులకు పార్టీ ఇద్దామని ఆటోడ్రైవర్‌ గణేష్‌తోపాటు మరో మిత్రుడితో కలిసి విజయ్‌కుమార్‌ రాత్రి 9గంటల సమయంలో శేరిలింగంపల్లి జోనల్‌ కార్యాలయం ఎదురుగా కొత్తగా ఏర్పడిన లింకురోడ్డు వైపునకు వెళ్లి మద్యం సేవించారు. వారిమధ్య ఏం జరిగిందో కానీ, గణేష్‌, మరో మిత్రుడు కలిసి బీరుబాటిల్‌ పగులగొట్టి విజయ్‌కుమార్‌ గొంతుకోసి పరారయ్యారు.


విజయ్‌కుమార్‌ కేకలు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 సహకారంతో అతన్ని కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు. గొంతుకు తీవ్రగాయం కావడంతో అక్కడి నుంచి ఈఎన్‌టీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విజయ్‌కుమార్‌ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి కోలుకుంటున్నట్లు ఈఎన్‌టీ వైద్యులు తెలిపారు. స్నేహితులు విజయ్‌కుమార్‌పై ఎందుకు దాడి చేశారు..? అనేది మిస్టరీగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-07-11T13:39:43+05:30 IST