మద్యం తాగేందుకు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి బైక్పై తిరిగి వెళ్తుండగా..
ABN , First Publish Date - 2020-08-07T20:00:30+05:30 IST
మధిర మండలంలోని దేశినేనిపాలెం వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి బైక్పైనుంచి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిది కృష్ణాజిల్లా నందిగామ పట్టణం.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మధిర/నందిగామ(ఆంధ్రజ్యోతి): మధిర మండలంలోని దేశినేనిపాలెం వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి బైక్పైనుంచి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిది కృష్ణాజిల్లా నందిగామ పట్టణం. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన మహ్మద్ గౌస్మోహిద్దీన్(49)తన మిత్రుడు దస్తగిరితో కలిసి బుధవారం రాత్రి 8గంటల సమయంలో నందిగామ నుంచి ద్విచక్రవాహనంపై మధిర కు వచ్చాడు. మధిరలో మద్యం సేవించిన వీరు తిరిగి అర్ధరాత్రి బైక్పై నందిగామవైపు వెళ్తున్నారు. అతివేగంతో వెళ్తున్న వీరు బైక్పై నుంచి జారి మార్గమధ్యంలో దేశినేనిపాలెం వద్ద ప్రధాన రహదారిపై కిందపడ్డారు. వెనుక కూర్చున్న మోహిద్దీన్ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మిత్రుడు దస్తగిరి అక్కడి నుంచి నందిగామ వెళ్లిపోయాడు. తెల్లవారుజామున 5గంటల సమయంలో దేశినేనిపాలెం వద్ద ప్రధాన రహదారిపై పడిఉన్న మృతదేహాన్ని సుబాబుల్ కూలీలు చూసి సర్పంచ్కు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో టౌన్ ఎస్ఐ ఉదయ్కుమార్ తమ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు నమోదుచేసుకున్నారు. మృతుడి మిత్రుడైన దస్తగిరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మాటూరుపేటలో వివాహిత ఆత్మహత్యాయత్నం
మధిర మండలం మాటూరుపేట గ్రామంలో అనారోగ్యకారణాలతో ఒక వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామంలో గంధసిరి వెంకట్రావమ్మ(35)గత కొన్నినెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. అనారోగ్య సమస్యలు తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో 108 ఆంబులెన్సులో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.