Serum Institute చరిత్ర ఇదీ.. ఈ సంస్థను ప్రారంభించాలని సైరస్ పూనావాలకు ఎందుకు అనిపించిందంటే..

ABN , First Publish Date - 2021-05-04T19:52:32+05:30 IST

భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేశానికి ఉన్న ఏకైక ఆశాకిరణం వ్యాక్సినేషన్. దీన్ని సాధ్యం చేస్తున్న సంస్థల్లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒకటి. భారత్‌లో ప్రభుత్వ అనుమతులు పొంది, ప్రజలకు వేస్తున్న వ్యాక్సిన్లలో కొవిషీల్డ్ ఒకటి. దీన్ని తయారు చేసిన సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్.

Serum Institute చరిత్ర ఇదీ.. ఈ సంస్థను ప్రారంభించాలని సైరస్ పూనావాలకు ఎందుకు అనిపించిందంటే..

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ముఖ్యంగా భారత్‌లో తాజా పరిస్థితులు అత్యంత హృదయవిదారకంగా ఉన్నాయి. ఈ వైరస్ కారణంగా మరణించిన వారి శవాల దిబ్బలు, ట్రీట్‌మెంట్ కోసం ఎదురు చూసే పేషెంట్లు, ఆక్సిజన్ అందక అల్లాడుతున్న ప్రాణాలు ఇవీ భారత్‌లో ఎటు చూసినా కనిపిస్తున్న దృశ్యాలు. అయితే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేశానికి ఉన్న ఏకైక ఆశాకిరణం వ్యాక్సినేషన్. దీన్ని సాధ్యం చేస్తున్న సంస్థల్లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒకటి. భారత్‌లో ప్రభుత్వ అనుమతులు పొంది, ప్రజలకు వేస్తున్న వ్యాక్సిన్లలో కొవిషీల్డ్ ఒకటి. దీన్ని తయారు చేసిన సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్. ప్రపంచంలో వ్యాక్సిన్లు తయారుచేసే ప్రముఖ సంస్థల్లో ఒకటైన ఇది ఎలా ప్రారంభమైందో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే దీనికి పునాదులు అలా పడ్డాయి మరి. ఇంకెందుకాలస్యం ఆ కథలోకి వెళ్లిపోదాం..


కొన్ని తరాల క్రితం పూనావాలా కుటుంబం గుర్రాలు పెంచుకునేది. ఈ క్రమంలోనే డాక్టర్ సైరస్ పూనావాలాకు 70 ఎకరాల్లో ఉన్న గుర్రాల పెంచుకునే ప్రాంతం వారసత్వంగా దక్కింది. ఆ వ్యాపారాన్ని మరింత పెంచి, గుర్రాల వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచారు సైరస్ పూనావాలా. ఆ తర్వాత అనుకోకుండా ఒకసారి తన మిత్రుడైన ఒక వెటర్నరీ డాక్టరుతో మాట్లాడిన సైరస్ పూనావాలాకు.. వ్యాక్సిన్ ఉత్పత్తి వ్యాపారం చేయాలని అనిపించింది. ఇలా యాదృచ్ఛికంగా ప్రారంభమైన సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్. ప్రస్తుతం ఇది 12.8 బిలియన్ డాలర్ల కంపెనీ. దీన్ని స్థాపించిన సైరస్ పూనావాలా.. భారత్‌లో అత్యంత సంపన్న కుబేరుల్లో 7వ వ్యక్తి.


పూనావాలా గుర్రాల పెంపకం శాలలో ముసలివైన గుర్రాలను ముంబైలోని హాఫ్‌కైన్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపేవారు. అక్కడ వాటి సీరమ్ నుంచి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేవారు. అయితే ఈ టీకాలను వారు భారీగా ఉత్పత్తి చేసేవారు కాదు. దీంతో ఎక్కువ శాతం టీకాలను భారతదేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ఇదే విషయం మిత్రునితో సంభాషణ మధ్యలో రావడంతో పూనావాలాకు దానిలో అవకాశం కనిపించింది. అప్పుడే సోదరుడు జావరీతో కలిసి గుర్రాలను అమ్మేశారు. ఇలా అమ్మగా వచ్చిన 12వేల డాలర్లతో 1966లో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. అయితే ఈ రంగంలో అవకాశాలు ఉన్నప్పటికీ అది వారికి కొత్త. అనుభవం లేదు. ఈ సమస్యను అధిగమించడం కోసం హాఫ్‌కైన్ నుంచి ముగ్గురు డాక్టర్లను ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పూనావాలాతోనే ప్రయాణం చేస్తున్న ఈ ముగ్గురు వైద్యులు.. ప్రస్తుతం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో బోర్డు మెంబర్లుగా ఉన్నారు.


ప్రస్తుతం ప్రపంచంలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సంస్థల్లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఒకటి. ఇది ఎంతగా ఈ రంగంలో ఎదిగిందంటే.. ఒక ఇంటర్వ్యూలో పూనావాలా మాట్లాడుతూ ‘‘కోకాకోలా, పెప్సికో వంటి కంపెనీలు కలలో కూడా ఊహించలేనంత మందికి మా ఉత్పత్తులు అందుతున్నాయి’’ అని చెప్పారు. దీన్నిబట్టే ఈ కంపెనీ ప్రపంచంలో ఎంతలా విస్తరించిందో తెలుసుకోవచ్చు. ఈరోజు భారత్‌లో కరోనా మహమ్మారి అణచడంలో కూడా ఈ సంస్థ కీలకపాత్ర పోషిస్తోంది. అంతేకాదు ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించగానే మాస్ ప్రొడక్షన్ ప్రారంభించడానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ రెడీగా ఉందట. 


సాధారణంగా ఒక వ్యాక్సిన్‌కు ప్రభుత్వ అనుమతి లభించాలంటే నాలుగైదేళ్లు పడుతుందని, అయితే యూకేలో తమ వ్యాక్సిన్  ప్రస్తుతం హ్యూమన్ ట్రయల్స్ దశలో ఉందని, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ 80 శాతం సక్సెస్ అవుతుందని పూనావాలా చెప్పారు. అప్పటికల్లా భారత్‌కేకాక, ఇతర దేశాలకు కూడా లక్షల డోసుల వ్యాక్సిన్ అందించడానికి తమ సంస్థ సిద్దంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలా గుర్రాల పెంపకంతో మొదలైన కంపెనీ నేడు ప్రపంచంలో కోట్లాదిమంది ప్రాణాలను కాపాడుతూ దినదినాభివృద్ధి చెందడం ఎంతో స్ఫూర్తిదాయకంగా లేదూ?

Updated Date - 2021-05-04T19:52:32+05:30 IST