కరోనా రోగులకు మమతాబెనర్జీ Fruit basket బహుమతి
ABN , First Publish Date - 2022-01-07T15:40:50+05:30 IST
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వం కొవిడ్ రోగుల కోసం ప్రత్యేకమైన బహుమతిని పంపిస్తోంది...
త్వరగా కోలుకోండి అంటూ సీఎం సందేశం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వం కొవిడ్ రోగుల కోసం ప్రత్యేకమైన బహుమతిని పంపిస్తోంది.కరోనా రోగులకు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నుంచి పండ్ల బుట్టతోపాటు ‘కరోనా నుంచి మీరు త్వరగా కోలుకోండి’ అనే సందేశాన్ని పంపిస్తున్నారు.ఇప్పటివరకు 10వేల మందికి పండ్ల బుట్టలను సిద్ధం చేసి. కోల్కతా నగరం అంతటా కరోనా రోగులకు పంపిణీ ప్రారంభించారు.కరోనా రోగులకు పండ్ల బుట్టలను పంపిణీ చేసే పనిని కౌన్సిలర్లకు అప్పగించారు. కౌన్సిలర్లు పండ్ల బుట్టల పంపిణీ కోసం కరోనా రోగుల ఇళ్లకు వెళుతున్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో పండ్ల బుట్టలను భవనం బయట పెట్టి నివాసితులకు ఫోనులో సమాచారం అందిస్తున్నారు.
ఇప్పటివరకు 2,075 మంది కొవిడ్ రోగులు ఆసుపత్రుల్లో చేరారని సీఎం మమతాబెనర్జీ చెప్పారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 403 కొవిడ్ కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. కొవిడ్ పాజిటివిటీ రేటు 23.17 శాతం ఉంది. కరోనా రోగుల కోసం 19,517 బెడ్లను అందుబాటులో ఉంచారు. అంతర్ రాష్ట్ర కదలికలకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.