రూ.20 లక్షల గంజాయి స్వాధీనం
ABN , First Publish Date - 2021-01-24T06:24:54+05:30 IST
జాతీయ రహదారిపై సూర్యారావుపేట దుర్గమ్మ గుడి సమీపంలో గంజాయి తరలిస్తున్న రెండు వాహనాలను ఆదివారం రాజానగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజానగరం, జనవరి 23: జాతీయ రహదారిపై సూర్యారావుపేట దుర్గమ్మ గుడి సమీపంలో గంజాయి తరలిస్తున్న రెండు వాహనాలను ఆదివారం రాజానగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ ఎం.వి.సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం ఉన్నతాధికారులకు ముందుగా అందిన సమాచారం మేరకు డీఎస్పీ ఏటీవీ రవికుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ ఎండీ జుబేర్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా నర్సీపట్నం వైపు నుంచి వస్తున్న ఒక కారుతో పాటు వ్యాన్ను పోలీసులు పట్టుకున్నారు. కారు నడుపుతున్న నర్సీపట్నం గ్రామానికి చెందిన పూడి స్వామిని, హైదరాబాద్కు చెందిన వ్యాన్ డ్రైవర్ కామ్రే సతీష్ అలియాస్ బాలనారాయణను అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 400 కిలోల గంజాయితో ఒక కారు, ఒక వ్యాన్, రెండు సెల్ ఫోన్లు, రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.20 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు ఎస్ఐ ఎంవీ సుభాష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.