జూదాల జోరు
ABN , First Publish Date - 2022-01-17T05:08:09+05:30 IST
సంక్రాంతి పేరుతో రాజమహేంద్రవరం నార్త్జోన్ పరిధిలో కోరుకొండ మండలంలో జూదాలు జోరుగా జరిగాయి. నాలుగు గ్రామాలు మినహా అన్ని గ్రామాల్లో కోడిపందాలు, గుండాట నిర్వహించారు.
- ఫలించని పోలీసుల సంప్రదాయ క్రీడా పోటీల నిర్వహణ
- మధురపూడిలో కోడిపందేలు, పేకాట
- ఈ సందర్భంగా కొట్లాటలు.. పలువురికి గాయాలు
కోరుకొండ, జనవరి 16: సంక్రాంతి పేరుతో రాజమహేంద్రవరం నార్త్జోన్ పరిధిలో కోరుకొండ మండలంలో జూదాలు జోరుగా జరిగాయి. నాలుగు గ్రామాలు మినహా అన్ని గ్రామాల్లో కోడిపందాలు, గుండాట నిర్వహించారు. సంక్రాంతి 10 రోజుల ముందు సంప్రదాయ ఆటల పోటీలు అంటూ హడావుడి చేసి యువతను పెడదోవ పట్టకుండా క్రీడా పోటీలు నిర్వహించామని గొప్పలు చెప్పుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. నార్త్జోన్ పరిధిలో సంక్రాంతి సంద ర్భంగా సుమారు రూ.2 కోట్లకు పైగా గుండాట, ఇతర పందేలు, పేకాట నిర్వ హించారు. పోలీసులు భౌతికంగా ఎలాంటి దాడులు నిర్వహించిన దాఖలాలు లేవు. ఒక్కో గ్రామంలో పందేల నిర్వాహకులు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు గుండాట ఆడుకునేందుకు వేలం పాటలు నిర్వహించారు. దీంతో వేలం పాడుకున్న వారు గ్రామ జనాభాను బట్టి 4నుంచి 8 గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో జనరేటర్తో ఫ్లడ్లైట్లు పెట్టి తెల్లవారుజామున 2గంటల వరకు గుండాట, పేకాటలు ఆడుకున్నారు. మండలంలో రోజుకు సగటున 800నుంచి 1000 కోడిపుంజులు తలలు తెగిపడ్డాయి. మూడు రోజుల సంక్రాంతి పేరుతో 3వేలకు పైగా కోడిపుంజులు బలయ్యాయి. మధురపూడి, తొర్రేడు గ్రామాల మధ్య మామిడితోటల్లో భారీ స్థాయిలో నిర్వహించిన కోడిపందేలు, గుండాట, పేకాటల్లో కోట్లాటలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురికి గాయాలయ్యాయి.