గణపవరంలో గ్రావెల్ అక్రమ రవాణా
ABN , First Publish Date - 2021-03-07T06:41:10+05:30 IST
గణపవరంలో గ్రావెల్ అక్రమ రవాణా
విజయవాడ, మార్చి 6 : సీఎం జగన్ మేనత్త గ్రామమైన గణపవరంలో వైసీపీ నాయకులు యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నారు. శనివారం రాత్రి గ్రామంలోని గణపతి గట్టులో పొక్లెయిన్ ఏర్పాటుచేసి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా వందలాది ట్రిప్పుల గ్రావెల్ను అక్రమంగా తరలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్ను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఒక్కో ట్రక్కు గ్రావెల్ను రూ.1,500 నుంచి రూ.2వేలకు అమ్ముకుని జేబులు నింపుకొంటు న్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మట్టి, గ్రావెల్ను అక్రమంగా తరలించి లక్షలాది రూపాయల ఆదాయం పొందినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికే గణపతి గట్టును సగం తొలిచేశారు. మిగిలిన సగభాగాన్ని కూడా స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారని రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఇదంతా జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి శని, ఆదివారాల్లో ఇటుక బట్టీలకు మట్టి, గ్రావెల్ తరలిపోతోందని ఫిర్యాదు చేసిన వారిపై వైసీపీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం.