America: అగ్రరాజ్యంలో మరోమారు మహాత్మాగాంధీ విగ్రహానికి అవమానం
ABN , First Publish Date - 2022-08-20T13:21:34+05:30 IST
అమెరికాలో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి మరోమారు అవమానం జరిగింది. న్యూయార్క్లోని శ్రీతులసి మందిర్ ఆలయం ఎదుట ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. రెండు వారాల వ్యవధిలో ఈ విగ్రహంపై ఇది రెండో దాడి. తాజా ఘటన ఈ నెల 16న చోటుచేసుకుంది.
న్యూయార్క్లో గాంధీ విగ్రహం ధ్వంసం
రెండు వారాల్లో రెండో దాడి
ఖండించిన న్యూయార్క్ భారత కాన్సులేట్
నిందితులను సత్వరం పట్టుకోవాలని డిమాండ్
న్యూఢిల్లీ ఆగస్టు 19: అమెరికాలో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి మరోమారు అవమానం జరిగింది. న్యూయార్క్లోని శ్రీతులసి మందిర్ ఆలయం ఎదుట ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. రెండు వారాల వ్యవధిలో ఈ విగ్రహంపై ఇది రెండో దాడి. తాజా ఘటన ఈ నెల 16న చోటుచేసుకుంది. గుడి ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేసిన ఆరుగురు దుండగులు, పెయింట్తో ద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ నెల 3న సైతం ఈ విగ్రహంపై ఇదే తరహా దాడి జరగడం గమనార్హం. దుండగులందరూ పాతికేళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వారేనని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనను న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడు జెన్నిఫర్ రాజ్కుమార్ ఖండించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నూయార్క్ భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనను ఖండిస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి చర్యకు పాల్పడిన వారిని సత్వరం పట్టుకోవాలని అమెరికా అధికారులకు స్పష్టం చేశామని అందులో పేర్కొంది.