గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-09-17T05:30:00+05:30 IST
గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేయాలి
వికారాబాద్ రూరల్/మోమిన్పేట/ఘట్కేసర్ రూరల్: పట్టణంలో వినాయక నిమజ్జన ఏర్పాటు పూర్తిచేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. వికారాబాద్ పట్టణం, కొంపల్లి చెరువు వద్ద శుక్రవారం నిమజ్జన ఏర్పాట్లను డీఎస్పీతో కలిసి పరిశీలించారు. శోభయాత్ర, నిమజ్జనం కార్యక్రమాలు శాంతియుతంగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొంపల్లి చెరువు వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని, నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా, పట్టణంలోని కొంపల్లి, అనంతగిరిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు చిగుళ్లపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదిన సందర్భంగా బీటీఎస్ కాలనీలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ఆయన నివాసంలో రక్తదాన శిబిరం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కాగా మోమిన్పేటలో సీఐ వెంకటేశం, ఎస్ఐ శేఖర్గౌడ్లు మండల పరిధిలోని కాస్లాబాద్ నందివాగు ప్రాజెక్టును పరిశీలించి ఉత్సవ కమిటీలతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఘట్కేసర్లో ఎదులాబాద్ ప్రధాన చౌరస్తా నుంచి చెరువుకట్ట వరకు నిమజ్జనానికి తహసీల్దార్ విజయలక్ష్మి తగు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఐ ఎన్ చంద్రబాబు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.