దొంగల ముఠా అరెస్టు
ABN , First Publish Date - 2020-09-23T06:56:29+05:30 IST
జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆభరణాలను చోరీ చేస్తున్న దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. జిల్లా
సూర్యాపేట క్రైం, సెప్టెంబరు 22 : జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆభరణాలను చోరీ చేస్తున్న దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన హుజూర్నగర్ శివారు ప్రాంతంలోని లింగగిరి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామానికి చెందిన పటాన్ మోదీన్, హుజూర్నగర్లోని అంబేడ్కర్ కాలనీకి చెందిన మహ్మద్ జలాల్పాష అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని సోదాలు చేయగా వీరి వద్ద కొంతబంగారం దొరికింది.
వారిని విచారించగా ఈ ఏడాది జూలై 27వ తేదీన పెదవీడు గ్రామానికి చెందిన నాగుల్మీరా, నజీర్లతో కలసి అదే గ్రామంలోని చీదేళ్ళ సత్యనారాయణ ఇంట్లో 14 రకాల ఆభరణాలను దొంగిలించారన్నారు. పోలీసులు అప్రమత్తమై వీరి వద్ద నుంచి 30 తులాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం పెదవీడు లో ఉన్న మరో ఇద్దరు నేరస్థులు నాగుల్మీరా, నజీర్ల వద్ద నుంచి 30 తులాల ఆభరణాలను, దొంగతనానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో హుజూర్నగర్ సీఐ రాఘవరావు, ఎస్ఐ విష్ణు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు
ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభ నేపథ్యంలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. బెట్టింగ్ల పేరుతో యువతను ప్రలోభాలకు గురి చేస్తే సహించేది లేదన్నారు. బెట్టింగ్ల సమాచారం అందిస్తే కేసులో స్వాధీన తీవ్రతను బట్టి రూ.5 వేలకు పైబడి నగదు బహుమతి అందిస్తామన్నారు. సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నంబర్లు 9346506767, 9390564900 సంప్రదించాలన్నారు.